ఏరీ ఆ శబ్దవిధాతలు నేడు !?!

murali

గతితార్కికభౌతికవాదప్రభావఫలితంగా తెలుగులో ప్రగతిశీలకవిత్వం వెలువడసాగిన తొలిరోజులలోనే అభ్యుదయకవులు ప్రచారంలో ఉన్న పెక్కు పదాలకు ప్రవాహవేగంతో ముంచెత్తుతున్న నవీనభావాల అర్థసమర్పకశక్తి లేదని గ్రహించారు. సంప్రదాయధోరణిలో ధారుణిలో బలంగా వేరూని నిలిచిన ప్రతీకలకు కొత్తరంగులద్ది, రాజకీయరూపచిత్రాలుగా పరివర్తించి, వాటికి మళ్ళీ ప్రాణం పోశారు. ఆ పౌరాణికశైలితో కాలానుగుణమైన నూత్నపరిభాషను కల్పించుకొని అజరామరమైన పదబంధా లెన్నిటికో నవ్యవిధాతలై రాణించారు. “క్రొత్త పాతల మేలి కలయిక”గా గురజాడతో ప్రారంభమైన ఈ మార్గాన్ని సుగమీకరించి భావకవులు “మామిడికొమ్మమీద కలమంత్రపరాయణుడైన కోకిల, స్వామికి మ్రొక్కి” అభినవధ్వనిధారణకు ఉద్యమింపగా – అభ్యుదయకవులు “సకలప్రజాసముద్ధర్త, సుప్తోద్ధృతజీవశక్తి”తో ఉత్తుంగ ప్రగతిశిఖరాల నుంచి నవ్యజలపాతాలను ప్రవహింపజేశారు. కావ్యదృష్టి ఒకరికి అనంత రసవృష్టి, మరొకరికి దురంత ఖడ్గసృష్టి. ఈ అద్యతనుల అనర్ఘమైన కృషి ఫలితంగా భావంలోనే కాక భాషలోనూ సరికొత్త మార్పులేర్పడి ఆకర్షణీయమైన పదసంపద చిరస్మరణీయంగా వెలసి విలసిల్లింది. ఆ నవీన గద్గదనదద్గోదావరీవారి తెలుగువారి ఆలోచనాక్షేత్రాలను సస్యశ్యామలం చేసింది. కవుల పేరు వింటే కవితలూ, కావ్యాల నామధేయ రూపధేయాల కంటె ప్రచార భేరీభాంకారాల భాగధేయమే కనుపిస్తున్న కాలంలో ఉన్నాము మనం. కవికీ, కవిత్వానికీ నిలకడ లోపించింది. “నిత్యవేగి నా, చిత్తము; శబ్దమేరుటకు చిన్నము నిల్వదు!” అన్నారు కాని, విశ్వనాథ కావ్యసరణి ఇరవైయవ శతాబ్ది సాహితికి ప్రాణంపోసిన సంధానకరణి. ఆ సంజీవనీశక్తి కుశలకరాంగుళులలో రూపుదిద్దుకొని సాహిత్యసౌహిత్యికుల నాలుకలపై నాట్యం చేస్తున్న శైలీశైలూషి అందచందాలు అన్నీ ఇన్నీ కావు. సంప్రదాయకవిత్వపు గౌరీశంకరశిఖరం మీద నిలిచి విశ్వనాథ “జీవుని వేదన” సృజించి వ్యాపింపజేసిన అనల్ప కల్పనాశిల్ప శాలీనతకు దీటుగా శ్రీశ్రీ నేతృత్వంలోని అభ్యుదయకవిత్వంలో “మరోప్రపంచం” నేలకు దిగివచ్చింది.

జీవితచరమసంధ్యాసమయంలో ఉన్న చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారిని కవిత్వలక్షణం ఏమిటని శ్రీశ్రీ అడిగితే ఆయన అన్నారట: 1) రమ్యాక్షరనిబంధం వల్ల కంఠవశం కాగల రచన 2) జాతీయజీవనస్రవంతిలో నుంచి వేణికలల్లిన సన్నివేశాలతో మననం చేసుకోవటానికి అనువయిన పదసంచయనం 3) ధారావిశుద్ధి మూలాన రసనాగ్రనర్తకిగా ఉండటం.

శాస్త్రిగారు చెప్పిన ఆ మూడు లక్షణాలూ పదపరివృత్తిని బట్టి వస్తుతః సమానార్థబోధకాలే అయినా వాటిలో కొంత ఛాయావిభేదం లేకపోలేదు.

రమ్యాక్షరనిబంధమన్నది కవితాశైలికి సంబంధించిన మసృణత్వం. అది సందర్భవశమే కాని సర్వకాల సర్వావస్థాగతం కాదని పొరబడకూడదు. ‘రమ్యత’ అంటే పాఠకుడు ఒక రచనను చదివిన కొంతకాలం తర్వాత దానిని మళ్ళీ అధ్యయనం చేసినప్పుడు – ప్రతిపాద్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోగలగటం వల్ల, జీవితంలో తాను పొందిన సుఖదుఃఖాల అనుభవపరిణామం వల్ల, ఆత్మసంస్కారం వల్ల ఆ రచన మరింత కొత్తగానూ, మరింత దీప్తంగానూ భాసించే స్వభావాన్ని కలిగి ఉండటం అన్నమాట. కవియొక్క ప్రతిభాశక్తి కాలాంతరంలోని పాఠకుల అవగాహన పరిధికంటె ఎన్నోరెట్ల గాంభీర్యౌన్నత్యాలతో విలసిల్లితే గాని ఆ రమ్యాక్షరనిబంధం సాధ్యం కాదు. కవి ఎన్నెన్ని పూర్వజన్మలలో ఆరాధించి ఎంతమంది మహాకవుల నుంచి మూటగట్టి తెచ్చుకొన్న పుణ్యఫలమో అది!

కవిత్వాన్ని జాతీయ జనజీవనస్రవంతిలో నుంచి వేణికలల్లిన సన్నివేశాలతో విశ్వజనీనంగా తీర్చిదిద్దాలన్న ఆదర్శంలో కవి మనీషిత, లోకహితైషిత గోచరిస్తాయి. వేణికలల్లటం కేవలం ఆఖ్యానశిల్పానికి పరిమితమైన ఔపచారిక శబ్దప్రవృత్తి కాదు. కథాగతులైన వ్యక్తుల శీలౌన్నత్యానికి, శీలభ్రష్టతకు కారణాలేమిటో నిరూపించి, లోకానికి ఉపదేశప్రాయమైన రచనను చేయగలగటం అన్నమాట. ఆ రచనకు మూలాన్ని జాతీయ జనజీవితాలలో నుంచి తీసుకోవటం వల్ల పాఠకుడు తన జీవితాన్ని దానితో సరిపోల్చుకొని, తన జీవితానికొక గమ్యాన్ని, ఒక ఆదర్శాన్ని కల్పించుకోగలుగుతాడు. కవిత్వ రచనోద్దేశం ఆ ఆదర్శకల్పనల ఫలమైన సమాజాభ్యుదయమే. ఒక్కొక్క యుగంలో పరిభాష మారుతుందే కాని పార్యంతికఫలశ్రుతి అదే.

ధారాశుద్ధి అంటే వర్షామేఘం నుంచి తెంపు లేకుండా స్రవించే నీటిచాలు లాగా కవిత్వం పరిశుద్ధమైన పదసంపదతో హాయిగా సాగిపోవటం. పద్యమైనా, గేయమైనా పాఠకులకే గాక రచించిన కవికి సైతం గుర్తుండని స్థితి ఏర్పడటానికి కారణం ఈ ధారావిశుద్ధి లోపమే. ఈ ధారావిశుద్ధి స్వస్వరూపంతో చదువరుల గుండెలకు హత్తుకొనిపోవాలనే విశ్వనాథ వారు కావ్యరచనావేళ ఒక పూర్తి సన్నివేశాన్ని పూర్తిగా మనస్సులో కూర్చుకొన్నాక లేఖకునికి చెప్పి వ్రాయించటం జరిగేది. అజంతా గారు ఒక గేయం పూర్తిగా మనస్సులో నిలిచిపోయిన తర్వాత దానిని ఎన్నోమార్లు నెమరువేసుకొని, ధారణను సరిచూసుకొని, నిబ్బరంగా కుదిరిందని అనిపించిన తర్వాతనే ఆ నిరాకార శబ్దస్రవంతిని కాగితం పైకి ప్రవహింపజేసేవారు. చెళ్ళపిళ్ళ వారికీ, శ్రీశ్రీకీ, ఎంతోమంది మహాకవులకూ అభ్యస్తపూర్వమైన కవితా రచనా దృగ్విషయం అది.

viswa

అనువాదాలపై ఆధారపడక స్వతంత్రావిర్భావవికాసాలను కలిగివుండటం కూడా ఉత్తమకవిత్వపు సాముద్రికలక్షణమని వెంకటశాస్త్రి గారు సూచించారట.

రూపానికి ప్రాధాన్యం ఇచ్చి వస్తువు విషయాన్ని ప్రసక్తింపలేదని ప్రథమదృష్టికి భాసింపవచ్చును గాని, ప్రతిపాద్యవస్తువుకు చిరంజీవిత వెంకటశాస్త్రిగారు అనుభవపూర్వకంగా చెప్పిన స్మరణయోగ్యత వల్లనే సిద్ధిస్తుందనేది అందరికీ తెలిసిన సత్యమే.

భావికాలికాకాంక్ష లేని కవిత్వానికి భవిష్యత్తు సంకోచప్రదమని శ్రీశ్రీ తరచు అంటుండేవారు. అపురూపమైన ఆ సగుణశక్తిసాధన తోనే శ్రీశ్రీ తనకాలంనాటి మూడు తరాలకు నాయకత్వం వహింపగలిగారు. అభ్యుదయకవులు ఆయనను శబ్దబ్రహ్మగా ఆరాధించి, అనుకరించి, పదికాలాలపాటు పదిలంగా నిలిచే పదబంధాలెన్నిటినో కవిత్వపరిభాషలో నియతంగా నిలిపారు. ఆయన ప్రకల్పించిన శబ్దపు తంత్రులను మ్రోగించి, నూతనస్వరాలను పలికించి, ఆత్మీయాదర్శాలతో జాతి అంతరంగసంగీతాన్ని వినిపించారు.

అభ్యుదయకవిత్వావిర్భావదశకం

గతితార్కికభౌతికవాదప్రభావఫలితంగా తెలుగులో ప్రగతిశీలకవిత్వం వెలువడసాగిన తొలిరోజులలోనే అభ్యుదయకవులు ప్రచారంలో ఉన్న పెక్కు పదాలకు ప్రవాహవేగంతో ముంచెత్తుతున్న నవీనభావాల అర్థసమర్పకశక్తి లేదని గ్రహించారు. సంప్రదాయధోరణిలో ధారుణిలో బలంగా వేరూని నిలిచిన ప్రతీకలకు కొత్తరంగులద్ది, రాజకీయరూపచిత్రాలుగా పరివర్తించి, వాటికి మళ్ళీ ప్రాణం పోశారు. ఆ పౌరాణికశైలితో కాలానుగుణమైన నూత్నపరిభాషను కల్పించుకొని అజరామరమైన పదబంధా లెన్నిటికో నవ్యవిధాతలై రాణించారు. “క్రొత్త పాతల మేలి కలయిక”గా గురజాడతో ప్రారంభమైన ఈ మార్గాన్ని సుగమీకరించి భావకవులు “మామిడికొమ్మమీద కలమంత్రపరాయణుడైన కోకిల, స్వామికి మ్రొక్కి” అభినవధ్వనిధారణకు ఉద్యమింపగా – అభ్యుదయకవులు “సకలప్రజాసముద్ధర్త, సుప్తోద్ధృతజీవశక్తి”తో ఉత్తుంగ ప్రగతిశిఖరాల నుంచి నవ్యజలపాతాలను ప్రవహింపజేశారు. కావ్యదృష్టి ఒకరికి అనంత రసవృష్టి, మరొకరికి దురంత ఖడ్గసృష్టి. ఈ అద్యతనుల అనర్ఘమైన కృషి ఫలితంగా భావంలోనే కాక భాషలోనూ సరికొత్త మార్పులేర్పడి ఆకర్షణీయమైన పదసంపద చిరస్మరణీయంగా వెలసి విలసిల్లింది. ఆ నవీన గద్గదనదద్గోదావరీవారి తెలుగువారి ఆలోచనాక్షేత్రాలను సస్యశ్యామలం చేసింది.

కవుల పేరు వింటే కవితలూ, కావ్యాల నామధేయ రూపధేయాల కంటె ప్రచార భేరీభాంకారాల భాగధేయమే కనుపిస్తున్న కాలంలో ఉన్నాము మనం. కవికీ, కవిత్వానికీ నిలకడ లోపించింది. “నిత్యవేగి నా, చిత్తము; శబ్దమేరుటకు చిన్నము నిల్వదు!” అన్నారు కాని, విశ్వనాథ కావ్యసరణి ఇరవైయవ శతాబ్ది సాహితికి ప్రాణంపోసిన సంధానకరణి. ఆ సంజీవనీశక్తి కుశలకరాంగుళులలో రూపుదిద్దుకొని సాహిత్యసౌహిత్యికుల నాలుకలపై నాట్యం చేస్తున్న శైలీశైలూషి అందచందాలు అన్నీ ఇన్నీ కావు. సంప్రదాయకవిత్వపు గౌరీశంకరశిఖరం మీద నిలిచి విశ్వనాథ “జీవుని వేదన” సృజించి వ్యాపింపజేసిన అనల్ప కల్పనాశిల్ప శాలీనతకు దీటుగా శ్రీశ్రీ నేతృత్వంలోని అభ్యుదయకవిత్వంలో “మరోప్రపంచం” నేలకు దిగివచ్చింది.

srisri-profile

రాయప్రోలు కాల్పనికజీవనదిలో నుంచి తీసిన భావకవితాకుల్యను మళ్ళీ విశ్వనాథ సంప్రదాయజలధిలో కలిపివేయడంతో భావకవితాయుగంలో ఒక సువర్ణావృత్తి పూర్తయింది.

ఆ ఉరవడికి తట్టుకొని స్వీయవ్యక్తిత్వాన్ని నిలుపుకొన్న సామాజిక శబ్దవిధాతలు అబ్బూరి రామకృష్ణారావు, ఉమ్రాలీషా, కృష్ణశాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్య, కుసుమ ధర్మన్న, జాషువా, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి కనుపిస్తారు. ఆ తర్వాత శిష్ట్లా, శ్రీశ్రీ, నారాయణబాబులు సృష్టించిన అభ్యుదయ ప్రవర అనిసెట్టి సుబ్బారావు, ఆరుద్ర, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, రెంటాల గోపాలకృష్ణ, కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు, ఆవంత్స సోమసుందర్, దాశరథి, బైరాగి, అజంతా, కవిరాజమూర్తి, దేవరకొండ బాలగంగాధర తిలక్ మొదలుకొని కాళోజీ, డా|| సి. నారాయణరెడ్డిల దాకా నిరంతరాయితంగా కొనసాగింది.

బోయి భీమన్న, గుంటూరు శేషేంద్రశర్మ, కోవెల సుప్రసన్నాచార్య, మాదిరాజు రంగారావు, చెరబండరాజు, జ్వాలాముఖి, సుబ్బారావు పాణిగ్రాహి, కె. సత్యమూర్తి, శివారెడ్డి, వరవరరావు, ఇస్మాయిల్, వేగుంట మోహన్ ప్రసాద్, గద్దర్, వంగపండు ప్రసాదరావు, ఓల్గా, ఘంటసాల నిర్మల, పాటిబండ్ల రజని, ముకుందరామారావు, పెన్నా శివరామకృష్ణ, త్రిపురనేని శ్రీనివాస్, ఎండ్లూరి సుధాకర్, అఫ్సర్, యాకూబ్, శిఖామణి, ఖాదర్ మొహియుద్దీన్, సతీష్ చందర్, జూపాక సుభద్ర, గోగు శ్యామల, చల్లపల్లి స్వరూపరాణి, మానస చామర్తి మొదలైన సమాజ ప్రియంభావుక కవులు తమతమ తీరుల కొత్త దారులను అభిమానించి వర్తమాన శరతల్పం మీదికి ప్రగతిశీల నవ్యోక్తివైఖరుల సంజీవనీ కావ్యజలధారను అమృతాయమానంగా తీసుకొనివచ్చినవారిలో కొందరు. వీరిలో పెక్కుమంది తమ వరివస్యతో అభ్యుయానంతర కవితా క్షితిజరేఖలను దిగంతాలకు విస్తరించే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు.cherabandaraju

అయితే, ప్రపంచీకరణ నేపథ్యంలో అనూహ్యమైన వేగంతో మారుతున్న సమాజంలో ఈనాడు కవులు సామాజిక హృదయస్పందనకు నేతృత్వం వహింపలేకపోవటానికి కారణం ఏమిటి? సాహిత్యప్రక్రియలపై ప్రసారసాధనాలు, ప్రచార రాజకీయాల దాడి ఈ మధ్యకాలంలో పదునెక్కుతున్నది. సారస్వతవ్యాపారసంస్థల పురస్కారసంస్కృతి ఈ పతనావస్థకు ప్రతిఫలనం. అన్యభాషలలో వలె కాక తెలుగువారు కవుల చలనచిత్రరంగప్రవేశాన్ని విస్ఫారితనేత్రాలతో తిలకించటం వల్ల ప్రాంతీయ వాణిజ్యావసరాలు సాహిత్యపరిభాషను శాసించటం మొదలయింది. నిర్ణేతృక సర్వసైన్యాధ్యక్షపదవిని వదులుకొని కవులే బంట్లుగా బానిసతనానికి తలొగ్గుతున్నారు.  విజాతీయధోరణులతో స్వరూపస్థితిని కోల్పోతున్న జాతిని దళితవాదకవయితలు వచ్చి మేల్కొలుపకపోతే నేటి సాహిత్యం పూర్తిగా నిర్నిమిత్తమై, విస్మరణీయావస్థలోకి జారుకొనేదనటంలో అతిశయోక్తి లేదు.

ఓల్గా

ఓల్గా

శ్రీశ్రీ యుగప్రభావం నాటి ప్రతిభావిలసన క్రమంగా పరిమితం కాసాగినందు వల్ల కవులు అల్పప్రాయమైన రూపవాదానికి ప్రాధాన్యమిచ్చి, చిరంతనమైన సమసమాజాదర్శాన్ని గౌణీకరించి, కల్పనాశిల్పాన్ని అనాదరిస్తున్నారు. సాహిత్యికులలో వ్యుత్పత్తిగౌరవం, క్రాంతదర్శిత క్రమంగా సన్నగిల్లుతూ వస్తున్నాయి. ప్రజాస్వామ్యం ధనస్వామ్యం వైపుకు పరుగులుతీస్తున్నది. అస్తిత్వవాదం నుంచి సంఘటితశక్తిగా ఆవిర్భవించి దళిత బహుజనకవిత్వం సమాజనిష్ఠం అవుతున్న రోజులలో కూడా కవులు వైయక్తికాదర్శాలతో వెలసిన వార్తాపత్రికలే వస్తునిర్దేశికలుగా సరిపెట్టుకొని, జాతిభవితవ్యం పట్ల మౌనం పాటిస్తూ స్వార్థ రాజకీయవిధాతల వేలుపట్టుకొని నడుస్తున్నారు. ప్రజాస్వామిక మానవసంబంధాలకు కట్టుబడిన చైతన్య ధనుష్పాణుల గొంతుక సొంత వ్యక్తిత్వాన్ని సంతరించుకొని ఇంకా బలంగా వినబడుతుందని ప్రజలు బ్రతుకుబాటలో తమకు దారిచూపే శబ్దవిధాతల పాటకోసం వెయ్యికళ్ళతో వేచిచూడక తప్పటం లేదు.

ఏల్చూరి మురళీధరరావు

మీ మాటలు

  1. మాస్టారికి నమస్కారం. ఈ వ్యాసానికి రెండో భాగం ఉన్నదని ఆశిస్తున్నాను. ఎనభై శాతం అభ్యుదయ కవిత్వ చరిత్రని నెమరువేసుకునేందుకే సరిపోయింది. ముఖ్య ప్రతిపాదన దగ్గరికి వచ్చేసరికే వ్యాసం అయిపోయింది, ఆ ప్రతిపాదన మూలాలను చర్చించకుండానే. కనీసం, నాకలా అనిపిస్తున్నది.

    • ఏల్చూరి మురళీధరరావు says:

      మాన్యులు శ్రీ నారాయణస్వామి గారికి
      నమస్కారములతో,

      ఆత్మీయమైన మీ స్పందనకు ధన్యవాదాలు. మీరన్నట్లుగానే, ఇంకా పరిపూర్ణించే ప్రయత్నం చేయాలి!

  2. మీరు వ్రాసినది చాలా కష్టం గా ఉంటుందండీ చదవడం. సరళమైన భాష తో ఇవే భావాలు వ్యక్తపరిస్తే నా లాటి వాళ్ళకి చదవడం సులభంగా ఉంటుంది. లేకపోతే ఒక యోగాభ్యాసం లా ఉంటుంది. దాని వల్ల అసలు విషయం గ్రహించడం కష్టమవుతుంది.

    • ఏల్చూరి మురళీధరరావు says:

      మాన్యమిత్రులు శ్రీ యోగా గారికి
      నమస్కారములతో,

      ప్రేమపూర్వకమైన మీ స్పందనకు ధన్యవాదాలు.

      మీరు మరీనూ, సార్. “యోగా”భ్యాసం మీకే కష్టం అయితే, మా వంటివారి సంగతేమిటి?

  3. Thirupalu says:

    //ఏరీ ఆ శబ్దవిధాతలు నేడు//
    శీర్షికలోనే సాహిత్యం ఈనాడు పడుతున్న దురావస్తకు అద్దం పట్టారు. మరీ ముఖ్యంగా ఈ వెబ్‌ పత్రికలలో కవిత్వాని సంపూర్ణంగా వర్తిస్తుంది. నారాయణ స్వామి చెప్పినట్లు వ్యాసాన్ని కొనసాగిస్తే మరిన్ని వివరాలు తెలుస్తూయి. ధన్య వాదాలు.

  4. ఏల్చూరి మురళీధరరావు says:

    శ్రీ తిరుపాల గారికి
    నమస్కారములతో,

    మీ ఆదృతికి, ప్రోత్సాహకవచనానికి కృతజ్ఞుణ్ణి!

మీ మాటలు

*