అబూజ్ మాడ్.. దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరిది. ఏడు దశాబ్దాల తరువాత కూడా స్వాతంత్ర్యం పొందామనుకుంటున్న ఈ దేశ చిత్రపటంపై ఈ పేరు ఒకటి వున్న ప్రాంతమున్నదన్నది అటు పాలకవర్గాలకు కానీ సామాన్య ప్రజానీకానికి కానీ ఎరుకలో లేదు. కానీ ఇటీవలి సామాజిక రాజకీయ ఉద్యమాల తీవ్రత పెరుగుతున్న క్రమంలో ఈ పేరు అందరికీ తెలిసింది. కాకులు దూరని కారడవి చీమలు దూరని చిట్టడవి అంటూ కార్పొరేట్ మీడియా కథనాలు ఈ ప్రాంతం చుట్టూ కమ్ముకుంటున్న సైనిక యుద్ధవాతావరణం దీనిని ప్రజలందరి మనసులో ఓ ప్రశ్నగానో లేక ఒక భయంగానో ఎక్కువమందికి ఆశ కల్పించే ఓ సుదూర అరుణతారగానో మదిలో మెదులుతూంది.
కారణం మధ్య భారత దేశంలో కేంద్రీకృతమైన ప్రజాయుద్ధ గెరిల్లా క్షేత్రం ఆదివాసీ సాంప్రదాయ ఆయుధాలతో పాటుగా ఆధునిక కలష్నికోవ్ లతో ఈ దేశ కార్పొరేట్ పాలక వర్గ సైన్యాన్ని సవాల్ చేస్తూ నిలబడి వుండడమే. దీని నేపథ్యంగా పాణి తన కవితా సంపుటిని అబూజ్ మాడ్ పేరుతో వెలువరించారు. విరసం బాధ్యులుగా వున్న పాణి తన విమర్శనారంగం, నవలా రచనలనుండి కవిత్వ రంగం వైపు అనివార్యంగా వచ్చానని తన ముందుమాటలో పేర్కొన్నారు.
“కవిత్వంతో ఎందుకులే అనుకున్నా… కానీ కవిత్వం కావాలి. కవిత్వం ఉద్యమాలకు కావాలి. కార్యకర్తలకు కావాలి. మనిషికి తప్పక కావాలి. కవిత్వం రాయడమొక అవసరమని, గొప్ప అనుభవమని, అంతులేని ఓదార్పు, తిరుగులేని శక్తి అనీ ఈ కవిత్వం రాస్తూ, రాస్తూ తెలుసుకున్నాను” అని అంటారు. నూతన మానవుని ఆవిష్కరణ అనే ఓ సుదీర్ఘ స్వప్నాన్ని కలగంటూ తడిగా బురద అంటి ముళ్ళు గుచ్చుకున్నా మండే కొండ రాళ్ళపై ఓర్పుతో సహనంగా నేలపై నగ్న పాదాలతో విల్లంబులు ఎక్కుపెట్టి తన నేలను నేల గర్భంలోని సంపదను భవిష్యత్ తరాలకు పచ్చగా అందించేందుకు గోచి పాతతో ఎదురొడ్డి నిలిచిన ఆదివాసీ ఈ దేశ అసలు సిసలు భూమిపుత్రులు చేస్తున్న పోరాటాన్ని త్యాగాన్ని వారికి దిశా నిర్దేశం చేస్తున్న ఉద్యమకారుల వీరోచిత నెత్తుటి త్యాగాలను అక్షరాలలో పచ్చి నెత్తుటి తడితో మనకు పరిచయం చేస్తూ తద్వారా ఓ సామాజిక సందర్భాన్ని యుద్ధ మేఘాల ఉరుములు మెరుపులను రాజ్యం చేస్తున్న హంతక పాలనను, కుట్రలు కుయుక్తులను కవిత్వంగా అందించారు పాణి.
అబూజ్ మాడ్ లో దండకారణ్యంలో కొనసాగుతున్న ఈ యుద్ధ వాతావరణంలో సంక్షుభిత కాలంలో జరుగుతున్న విధ్వంసపూరిత ప్రయాణంలో అక్కడే జరుగుతున్న అద్భుతమైన ప్రత్యామ్నాయ సామాజిక ప్రయోగం జనతన సర్కార్ గురించి పాణి కవిత్వం ద్వారా ప్రకటన చేసారు.
అబూజ్మాడ్ రాజకీయం అంటే – తెలియనిది తెలియడమే
శత సహస్ర యుద్ధ రంగాల్లో
గెలుపోటముల నిమిత్తం లేకుండా తలపడిన ఆదివాసీకి
నక్సల్బరీతోనే తన యుద్ధం రాజకీయమని తెలిసింది
పోటీ రాజకీయమని తెలిసింది
అప్పటి నుంచే దండకారణ్యం
లోకమంతా తెలుసుకోవాల్సిన ప్రయోగం అయింది… అంటారు.
గెలిచిన పోరాటాలు సరే
ఓడినా తలవంచని గాథలలోనే కదా
చరిత్ర రక్త ప్రసరణ పోటెత్తేది…
ఈ కవిత్వంలో సామూహిక సామాజిక నేపథ్యాలతో పాటు కవి తన వైయక్తిక భావ సంఘర్షణను హత్తుకునేట్టు ఆలోచింపచేసేట్టు అక్షరబద్ధం చేయడం విరసంపై గత కొన్నేళ్ళుగా ప్రధాన స్రవంతిలో వున్నామనుకుంటున్న కవుల సాహిత్యకారుల విమర్శలకు ధీటుగా చాలా కవితలు వున్నాయి. కవిత్వం కావాలి కవిత్వం అని గొంతెత్తేవారి దాహార్తిని తీర్చే కవిత్వం మెండుగా వుంది.
తెలిసీ తెలియక
దు:ఖమొకసారి కార్చిచ్చు
మరోసారి విరిగిపడే కడలి ఘోష
నీ స్పర్శకెపుడైనా తెలిసిందా
మనిషి తెలియకపోవడమే దు:ఖం
ఎందుకిలా ఉన్నాడు
ఎందుకిలా ఉన్నది
ఏ అంచనాకూ
పరికరాల్లేని నిస్సహాయతే దు:ఖం
అబూజ్ మాడ్ (కవిత్వం) – పాణి
ప్రతులకు: దిశ పుస్తక కేంద్రం, సహచర బుక్ మార్క్, నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్. వెల: రూ.50/-
– కెక్యూబ్ వర్మ
కవికి, కవిత్వానికి వందనం .
మంచి పరిచయం వర్మగారూ.
మరికొంచెం ఉంటే బాగుణ్ణు అనిపించింది.
అభినందనలు.
ధన్యవాదాలు సర్..
ఓడినా తలవంచని గాథలలోనే కదా
చరిత్ర రక్త ప్రసరణ పోటెత్తేది…
ఓడినా తలవంచని గాథలలోనే కదా
చరిత్ర రక్త ప్రసరణ పోటెత్తేది…
అవును పదే పదే గుర్తు పెట్టుకోవాల్సిన వాక్యం . ప్రాణం లాంటి పంక్తి .
ఎక్కడ తగలాలో అక్కడ తగిలిన బాణం లాంటి వాక్యమే కదా కావ్యం ..
ఆచరణ అనే ఆయుధం నీ మొలకు వేలాడుతున్న ప్పుడే ఇలాంటి కవిత్వం వస్తుంది