అర్థసత్యాల చిత్కళ- స్వప్నలిపి

“నేను శోధన నాళికలలో జీవిస్తున్నాను. భ్రమ విభ్రమాలలో జీవిస్తున్నాను.” అని కనుల గాజుబుడ్లలో కలల రసాయనాన్ని నింపుకుని కవిత్వపు ఔషధాన్ని వెలువరించే చిత్కళ అజంతా- స్వప్నలిపి లోని కవిత్వం. బాధాగ్ని కుసుమాల పరిమళం, స్వప్నఖచిత శరీరాల రహదారి పాట, వేళ్లపై ప్రజ్వరిల్లే వైశ్వానర గోళాలు కలిసి నగ్నాక్షరాలుగా మారే క్రమంలో నా పద్యాలన్నీ చిత్తుప్రతులే  అనుకునే తుదిలేనితనం ఈ కవిత్వ లక్షణం. రాళ్ళు రువ్వితే గాయపడ్డ నీళ్ళు ఉవ్వెత్తున ఒళ్ళు విరుచుకుని ఊరిమీద పడ్డాయనే విశేషాన్ని చెప్పి కూడా “సుదీర్ఘంగా సాగుతున్న వాక్యం మీద ఒక వైపు రివాల్వర్, మరో వైపు పూలమాల/ నా చేతులు అవేనా?” అని అనుమానపడతాడు కవి.”శబ్ధ శరీరం మీది ఆఛ్ఛాదనల్ని విసర్జించి”  అందాకా దాగిన ఉమ్మెత్త చెట్లను, ఊసర క్షేత్రాలను/ఉద్రేకవంతమైన సరస్సులను, ఉరితీయబడుతున్న అక్షరాలను ఆవిష్కరించేందుకు వాస్తవానంతర ఊహాపత్రాలపై రాసుకున్న స్వప్నలిపి ఇది.

PQAAAJ9573n0A4gC1sSCu1EDVSXaXFx_88MLNtPyURkLyqs34FwYHhPWWUJ_x7KoX90nE_U-XyPUDEQVkg3Z1t7faJQAm1T1UH5aj_8VLErZ7mIBLlRS08t4SXK_

  నీ గదిగోడలపై అగ్నిచక్షువు నేనే

 

ఘూర్ణిల్లుతున్న విషాద వృక్షచ్ఛాయలలో అదృశ్యలోకాలను ఆవిష్కరిస్తున్న స్వాప్నికుడా

నేను నీలోనే ఉన్నాను, నీ కన్నీళ్లలోనే ఉన్నాను

నిషిద్ధ నగరంలో నీ ఆక్రందన ఎన్నోసార్లు విన్నానుకదా

నీ గది గోడలపై అగ్నిచక్షువు నేనే

 

నడిరాత్రి, నడివీధి స్వప్నకవాటాలు తెరుస్తున్నారు ఎవరో

నవ్వుతున్న పెద్దపులి కావచ్చు

వధ్యశిలలపై అరణ్య కుసుమాలు వెదజల్లుతున్న పరివ్రాజకుడు కావచ్చు

అజ్ఞాత యోధులను ఆశీర్వదిస్తున్న వనదేవత కావచ్చు

కాలమేఘాంచలాలపై వస్తున్న మృత్యు రధచోదకుడు కావచ్చు

 

నడిరాత్రి, నడివీధి అలజడి సృష్టిస్తున్నారు ఎవరో

నడుస్తున్న శిలా విగ్రహాలు కావచ్చు

చీకటి సోపానాలపై సాలభంజిక హెచ్చరిక కావచ్చు

జీవన సంకేతాలను కలుష భూయిష్టం చేస్తున్న విద్రోహి క్షుద్ర విన్యాసం కావచ్చు

 

నడిరాత్రి, నడివీధి మృత్యురేఖపై నగ్నతాండవం చేస్తున్న స్వాప్నికుడా

జ్వలిస్తున్న కన్నీళ్లలో ప్రతిఫలిస్తున్న ఆకారం నీదేనా?

మృత్యువు కలతనిద్ర క్షణమాత్రమే సుమా!

 

రాక్షసుని వెన్నెముకపై ప్రతిష్ఠించిన నగరంలో మనిషి చిత్రవధ ప్రత్యేక కళ

కలలలో సైతం అతడు శృంఖలుడే.

—***—-

వ్యాఖ్యానం:

 

కలలు నిషేధించబడిన ఛాయాలోకంలో తిరుగుతూ, వాస్తవాల వలువల్ని జార్చేసిన ఊహా శరీరాల్ని స్వప్నిస్తాడు ఒకడు. మొదలు తెగి విరిపడిన ఆశా విషాదాల అరకొర నీడల్లో  తన అంతర్లోకాలను పరచుకుంటాడు. అజ్ఞాతంగా, అనామకంగా అతని మారుమూల గదిలో ఆర్తారవాల్ని ఆలకించి జ్వలించే నిప్పుకళ్ళు మాత్రం ఒక్క కవివే.

 

ఆ స్వాప్నికుడి చుట్టూ లోకం పరిచే భ్రమలు, వెంట పరిగెట్టించుకుని నీరివ్వక నీరుగార్చే ఎండమావులు. అతని గది నుండి బయటికి ఆకర్షిస్తూ తెరుచుకున్న స్వప్నకవాటల అవతల పొంచి చూస్తున్నది “నవ్వుతున్న పెద్దపులి కావచ్చు”.  అక్కడ నుండి కనపడే దారుల్లో అప్పటివరకూ నడిచి వెళ్ళి ఆవేశపు అడవుల్లో అదృశ్యమైన వాళ్ల అడుగుజాడలు కాస్త గజిబిజిగానే ఉండొచ్చు. బహుశా అవి ఏ ఎదురుదాడుల మోతల్లోనో చిందర వందరగా చెరిపోయాయేమో! ఆ యుద్ధాల అంతంలో శాంతిని కూర్చుకుని దారిపొడవునా పూలనో మేఘాలనో పరచుకుంటూ నడిచెళ్తూ ఉన్నది ఒక పరివ్రాజకుడో ఒక మృత్యు రధచోదకుడో!

 

స్వప్నాల సెగకు తాళలేక , ఎంత నియంత్రించుకున్నా తనలోంచి వెలికొచ్చే ఆక్రందనలకు ఆగలేక తన నిద్రా సౌఖ్యం లోంచి, భద్రగదిలోంచి తెగించి బయటికొచ్చాడతను. నడివీధిలో నడిచెళ్ళే అతనికోసం ఆ నడిరేయి ఒక అమ్ములపొదిలా చీకటి చాటున ఎదురుచూస్తుండొచ్చు. దారిలో కనపడని ప్రతి ఎదుర్రాయి అతని తెగువపై ఎక్కు పెట్టబడిన ఒక ఆయుధమే. అతని చుట్టూరా రొదపెట్టే  అలజడికి కారణం “నడుస్తున్న శిలా విగ్రహాలు కావచ్చు/చీకటి సోపానాలపై సాలభంజిక హెచ్చరిక కావచ్చు.”

 

బహుశా ఆ ప్రయాణం నడక కాదు. రగిలే జ్వాలపైన నక్షత్రాల కళ్లతో వెలిగే ఆకాశం కింద సన్నటి తాడు పైన దిగంబర నాట్యంలాటి విన్యాసం. ఏమాత్రం ఏమారినా “మృత్యువు కలతనిద్ర క్షణమాత్రమే సుమా!” అనే హెచ్చరిక అతని నాట్యానికి నేపథ్య సంగీతంలా వినిపిస్తుంది.

 

సాంఘికంగా, సామాజికంగా బందీగా బ్రతికే మనిషి వాటి నియమాలను, అలవాట్లను కాదని, ఊహల్లో సైతం స్వేచ్ఛనివ్వని శృంఖలాలను తెంచుకునే రాపిడిలోని గాయాలను, విముక్తికో, నవీనతకో చేసే మార్గాన్వేషణలోని అనుక్షణ జరామరణాలను  హృదయానుకంపనతో స్పృశించిదీ కవిత.

 1swatikumari-226x300–బండ్లమూడి స్వాతికుమారి

మీ మాటలు

  1. chandolu chandrasekhar says:

    స్వాతి గారికి , అజంత గారి కవితలు వడ్డెర .చండీదాస్ గారి నవలలు చీకటి లో జీవుని ఆవేదన లాగ ,ఏడుపు గొట్టు అస్తిత్వం లాగ ఎవరికీ ఉపయోగ పడవు , hrk గారి వుహ ,ఆవేదన వేరు దానికి ఒక సామాజిక ప్రయోజనం వుంది .ఏదైనా మంచి విశ్లేషణ తో రాస్తున్నారు ,ధన్య వాదాలు

మీ మాటలు

*