అపురూపం … ఆ… స్వరసంగమం

bhuvanachandra (5)

“సంగీత సాహిత్య సమలంకృతే…” అని వాగ్దేవిని కీర్తించారు సి.నా.రె.గారు. 29.10.2013న రామోజీ ఫిలిం సిటీలో ఆ ‘పాట’ని గుర్తు తెచ్చుకోనివారు లేరు. ఆ రోజున అక్కడ సాక్షాత్తు ‘సంగీత సాహిత్య సరస్వతి’ కొలువైంది. 80 సంవత్సరాల తెలుగు చలన చిత్ర సంగీత, సాహిత్యకారులకు స్వరాభిషేకం ఆ శారదాదేవి సాక్షిగా జరిగింది. ‘కన్నుల పండువ’ అనే పదానికి అర్ధం ఆనాడు ‘కళ్ల’కి తెలిసింది. ‘వీనులవిందు’ అనే పదంలోని విందుని శ్రవణేంద్రియాలు, ఆస్వాదించాయి. అక్కడ వున్న ప్రతి మనిషీ ‘మానసికోల్లాసం’ అనుభవించారు.
మరోసారి అటువంటి ‘మహాసభ’ జరుగుతుందా? ఏమో! జరిగిన మహోత్సవాల్ని తలుచుకుని ఆనందం. ‘మళ్ళీ ఎప్పుడు?’ అని ప్రశ్నించిన గుండెకు ‘మౌనమే’ సమాధానంగా మిగిలింది.
సృష్టికర్త రామోజీ, రధసారధి ‘బాపినీడు’గారు చిరునవ్వుతో ఆహుతుల్ని ఆహ్వానిస్తుండగా, అతిరధ మహారధులు ఆ ‘స్వరమండపాని’కి విచ్చేశారు.
అరుగో.. ఎనభైలు దాటిన సంగీత చక్రవర్తులూ, సాహిత్య సామ్రాట్‌లూ. దర్శకేంద్రులూ, దర్శకరత్నలూ, గాయక, గాయనీ శ్రేణులు,, అబ్బా.. కెమెరాలు పులకించిపోయాయి.
దక్షిణ భారత చలన చిత్ర సంగీతానికి ఓ చిరునామా ఇచ్చిన శ్రీ ఎం.ఎస్. విశ్వనాధన్‌గారు. అరుగో.. చేతులు జోడించి నమస్కరిస్తూ… ఎన్నెన్ని అద్భుతమైన పాటలాయనవీ.
అరుగో… కర్ణాటక సంగీతాన్ని వినీలాకాశంలో నిలబెట్టిన అచ్చ తెలుగు వాగ్గేయకారుడు శ్రీ బాల మురళీకృష్ణ.. “సాక్షాత్తూ శ్రీ కృష్ణుని వేణువే భువిలో బాలమురళియై అవతరించిందా..! అనిపించేంత మహోన్నత సంగీత విద్వాంసుడూ, నవరాగాల సృష్టికర్తా.. మెల్లగా నడిచి వస్తున్నారు. చిరునవ్వుతో వాహ్.. ‘పంచెకట్టు’ని తన కవిత్వంతో ప్రపంచవేదిక మీద నిలబెట్టిన ‘విశ్వంభరుడు’ జ్ఞానపీట్ అవార్డు అందుకున్న సుజ్ఞాన మూర్తి.. ఆచార్య ‘సి.నా.రే’ మెల్లమెల్లగా వస్తున్నారు. ఆ మహనీయులందరికీ పాద నమస్కారాలు చెయ్యని మనిషి ఆ మహోత్సవంలో లేరు. ఎవరు చెప్పారు? . ఆ మహానుభావులు పాదాల మీద వాలమని?

b2
ఆహా నిలువెత్తు మనిషి! పదహారు భాషల్లో ఏభైవేలకి పైగా పాటలు పాడి ‘గిన్నీస్’ బుక్కులో ధృవతారలా మెరుస్తున్న ఆ బిగ్‌బాస్ డా.కె.జె.ఏసుదాస్ కాక ఇంకెవరూ… పక్కనే విజయ్ యేసుదాస్.. వర్ధమాన్ గాయకుడూ, తండ్రికి తగ్గ తనయుడూ..
తెలుగు సినిమాకి నాలుగున్నర దశాబ్దాల పాటు వారే ‘దిశానిర్దేశకులు’.. నేటికీ ‘పెద్ద దిక్కు’ వారే.. శ్రీ దాసరి నారాయణరావుగారూ. శ్రీ కె.రాఘవేంద్రరావుగారూ, వారే … కృష్ణార్జునుల్లా నడిచొస్తున్నారు. ప్రేక్షకుల జేజేలు అందుకుంటూ..
ఎనభైకి దగ్గరవుతున్న ఆయన గుర్తున్నారా… ‘రాజన్ – నాగేంద్ర’ జంటలో నాగేంద్రగారు. ఎన్ని మధురమైన పాటల్ని ‘స్వరించారు’ నిటారుగా నడుస్తూ ‘కాలపు వీణ’కి స్వరాలందిస్తూ వస్తున్నారు.
అట్నుంచి వాణీ, జయరాంగార్లు.. భార్యభర్తలిద్దరూ ఆకూవక్కల్లాగా వస్తున్నారు. వాణీజయరాంగారి ‘బోలీరే పపీ హరా’ గుర్తున్నదా? ఇప్పటికీ అదే ‘గుడ్డీ’వాయిస్.
బి.వసంతగారు. మనకున్న మంచి గాయనీమణుల్లో ఆమె ఒకరు. ఏ ‘హిందీ’పాటని ‘కూనిరాగం’ తీసినా BGMతో ఆ పాటు పూర్తి లిరిక్స్‌తో పాడగల తెలుగు గాయని. ఇక అరుగో సుశీలమ్మ.. దక్షిణ భారత ‘లతా’ మంగేష్కర్. పాడేటప్పుడు ‘శ్వాస’ శబ్దం రానివ్వని ఏకైక గాయనీమణి. అదెలాగో ఇప్పటికీ సీక్రెట్టే.. దక్షిణ భారత దేశపు భాషలన్నీ సుశీలగారిని ‘ఆసరా’గా చేసుకుని తమ గీతాల్ని పల్లవించాయి.
అమ్మయ్యా.. వస్తున్నది చిత్రగారు. ‘వేణువై వచ్చాను భువనానికీ’ అంటూ శ్రోతల్ని కన్నీళ్లు కార్పించక మానదు. చెరగని ‘నవ్వు’ఆవిడకి దేముడిచ్చిన వరం. అందుకే ఆవిడకి ‘ప్రిన్సెస్ ఆఫ్ స్మైల్స్’ అని పేరు పెట్టాను.
చల్లగా నవ్వుతూ వస్తున్నారు ఎస్.పి.శైలజగారు. ఎస్.పి చరణ్ (బాలూగారి అబ్బాయి) ఎస్.పి శైలజ బాలూగారికి చెల్లెలుగా పుట్టకపోతే ‘డ్యూయట్లు’ అన్నిటిమీదా ఆమె పేరే రాయబడి వుండేదేమో.. ‘నాంపల్లీ టేసనుకాడ రాజాలింగో’ ఎవరు మరువగలరు? వాహ్.. ప్రణవి.. టిప్పూ.. టిప్పూగారి భార్య హరిణి.. సందీప్ ఇంకా ‘లిటిల్ చాంప్స్’ లోనూ ‘పాడుతా తీయగా’ లోనూ పాడిన యువ, చిన్నారి గాయకులు.. అదుగో గాయని విజయలక్ష్మి. అరుగో సాంగ్ పహిల్వాన్ ఎస్.పి.బాలూగారు. ఆ పక్కన ‘మనో’.. ఇంకేం కావాలి.. గాలి వాయులీనమైంది. గుండె ‘స్వరస్మృతుల’తో నిండిపోయింది. ఎందుకు నిండదూ? విద్యాసాగర్.. రాజ్.. రమణీ భరద్వాజ్.. ఎస్.ఏ.రాజ్‌కుమార్. గంగై అమరన్, మాధవపెద్ది సురేష్.. చైతన్య ప్రసాద్, దేవిశ్రీప్రసాద్, మణిశర్మ, సాలూరి వాసూరావు. ఆర్.పి. పట్నాయక్, అనూప్ రూబెన్స్, లాంటి సంగీత దర్శకులు తమ శ్వాసల్నే స్వరాలుగా పేరుస్తూ వుండగా.. అరుగో. సిరివెన్నెల సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, వెన్నెలకంటి రాజేశ్వర (ప్రసాదు) భాస్కరభట్ల రవికుమార్, జాతీయ పురస్కార గ్రహీత సుద్దాల అశోక్‌తేజ, వాచస్పతి సాయికుమార్.. ఓహ్.. మాటలే పాటలై పరవశిస్తున్నాయా..

ph 1
పరస్పర ఆలింగనలు
పాదనమస్కారాలు
ఆటోగ్రాఫులు
ప్రేక్షకులతో ఫోటోలు
అవిశ్రాంతంగా అందర్నీ, అన్నింట్నీ ‘తమలో’ ఇముడ్చుకుంటున్న వీడియో కెమేరాలు. నవ్వులు. అక్కడక్కడా భావోద్రేకంలో కన్నీళ్లు
ముఖాన తగిలించుకున్న ‘ముసుగు’ లన్నీ తొలగిపోయి స్వచ్చమైన మానవత్వం పరిమళించింది.
హృదయాల్లో స్నేహం పెల్లుబికింది.
బాలమురళీకృష్ణగారు, ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా’ అన్న ‘గుప్పెడు మనసు’ చిత్రంలోని పాటని అందుకోగానే అందరి కళ్లల్లో ఆనంద భాష్పాలు, ఎనభై మూడేళ్ల వయసా ఆయనది? మరి, ‘సలలిత రాగ సుధారస సారం’ పాటకి ఎలా పాడగలిగరబ్బా? నేటి బుల్లి గాయని ప్రణవితో..
“ఆకాశదేశానా… ‘ అని జేసుదాసుగారు పాడుతుంటే ఏమిటీ. యీ స్వరమందిరం పులకించిపోతోందేం..
మళ్లీ చిత్రగారు “వేణువై వచ్చాను భువనానికీ’ అని పాడుతుంటే, ‘గాలినైపోతాను గగనానికీ’ అంటూ వేటూరిగారు గాలిలా మారి అందరి గుండెల్ని సృశించారు.
జ్ఞాపకాల కన్నీళ్లు. స్వర వర్షంతో కలిసి పాటల వరదలయ్యాయి. ‘చినుకులా మారి’ అంటూ బాలుగారు వాణీజయరాంగారూ, ఎస్.పి.శైలజ కురిపించిన మధువుల్ని మనసునిండా నింపుకున్నాం.
అయ్యా.. ఇదో మరపురాని, మరువలేని స్వర సంగీత సాహిత్య సంగమం. ఎంత మైమరచిపోయానంటే, చెన్నై చేరుకున్నాక గుర్తొచ్చింది. మనసుతో తప్ప కెమేరాతో ఒక్క ఫోటో కూడా తీయలేకపోయానని.
అన్ని విషయాలూ, చలోక్తులూ, చమక్కులూ, చెప్పను. ఎందుకంటే నా గుండె మారుమూలల్లో ఓ పాట (రాజ్ కపూర్‌ది, ముఖేష్ పాడింది) వినిపిస్తోంది.
“కల్ ఖేల్ మే.. హం హో న హో” లో
గర్దిష్ మే తారే రహేంగే సదా
భూలోగే హమ్ భూలేంగే తుమ్
పర్ హమ్ తుమ్హారే రహెంగే సదా
రహెంగే యహీ.. ఆప్నీ నిశాన్
ఇస్ కె సివా జానా కహా..
జీనా యహా.. మర్‌నా యహా..
అంటూ ‘రేపటి ఆటలో మనముంటా’మో ఉండమో.. కానీ ఆ నీలాకాశంలో నక్షత్రాలు అక్కడే ఉంటాయి. అంతట్నీ చూస్తూ సాక్షులుగా, నువ్వు మర్చిపోవచ్చు, వారూ, మీరు అందరూ మర్చిపోవచ్చు. కానీ నేను మాత్రం సదా మీ మనిషినే! ఇవిగో.. నా జ్ఞాపకాల నీడల్ని ఇక్కడే వదిలి వెళ్తున్నాను. జీవించడమూ ఇక్కడే.. మరణించడమూ ఇక్కడే. వెళ్ళేది వేరెక్కడికీ..”
ఈ పాట నా గుండెని పిండేస్తోంది. మరోసారి అందరం కలుస్తామా… పోనీ ఏప్పుడో కలిసినా అందరం ఉంటామా? ఎందర్ని తల్చుకుని కన్నీళ్లు కార్చాలో.. ఎందరి జ్ఞాపకాల నీడల్లో నిట్టూర్పులు విడవాలో.. భగవాన్.. ‘కాహెకో దునియా బనాయీ? ఎందుకు సృష్టించావయ్యా యీ లోకాన్ని?

b1(1)
పోనీలే..
“ఇక్ దిన్ హై మిల్‌నా..
ఇక్ దిన్ హై బిఛడ్‌నా,
దునియా హై దో దిన్ కా మేలా…!” అని కదూ ముఖేష్ తన ‘దర్ద్ భరీ’ స్వరంతో పాడింది.. నిజమే రెండు రోజుల పాటు కలిసుండి తర్వాత ఎవరికి వారు విడిపోవలసిన ‘తిరునాళ్లే’గా జీవితమంటే..
‘చల్‌నా జీవన్ కీ కహానీ
రుక్‌నా మోత్ కి నిషానీ
(నడవడమే జీవితం అంటే.. ఆగటం అంటే మరణించడమే)
అందుకే భయ్యా.. చల్.. చల్తే చల్..
“చల్ అకెలా చల్ అకెలా చల్ అకేలా..”
మనుషుల్నీ, మమతల్నీ, మనుషుల్నీ కలుపుకుంటూ, విడిపోతూ జ్ఞాపకాల మూటల్ని మోసుకుంటూ, ప్రకృతి గీతం వింటూ సాగిపోదామా .. పదండి మరి..

ప్రేమతో
మీ భువనచంద్ర

(ఇంతటి మహాకార్యం అద్భుతంగా నిర్వర్తించి అసాధ్యాన్ని ‘సాధ్యం’ చేసిన శ్రీ రామోజీరావుగరికి పాదాభివందనం చేస్తూ..)

మీ మాటలు

  1. sayeerajmukh says:

    చాలా బాగుంది భాయ్…..మేమూ అక్కడ ఉన్నట్టుగా ఫీల్ అయ్యాం ……రెండో ఫోటో సమాచారం ఇవ్వలేదు ఎందుకనీ ? అది కూడా రాయండి …….చాలా హార్ట్ టచ్చింగ్ గా వుంది …….

మీ మాటలు

*