శుభ్రజ్యో్త్న నడయాడిన క్షణాలను ఒడిసి పట్టిన అనుభూతి!

drushya drushyam
ఫొటోగ్రఫి అన్నది ఒక వాహ్యాళి కావచ్చు. ఒక విహారయాత్ర కావచ్చు. వీధి భాగవతమూ కావచ్చును. ఎపుడైనా అది దైవ దర్శనమూ అయి వుండవచ్చు. ఇది అలాంటి ఘడియలో తీసిన ఒకానొక లిప్త. భగవంతుడికీ భక్తుడికీ మధ్య గోచరమైన ప్రసాదం. చెదిరిన కన్నయి,  కొవ్వొత్తి క్రీనీడల్లో రెపరెపలాడే దయామయమైన వెలుగునీడై దృశ్యమానమైన ఒక ఛాయఖండిక..

ఆలయంలో ఇదొక స్థితి-స్థాపకత. ఇక్కడి ఛాయాచిత్రణం ఒక ప్రత్యేక నాదం. హృదయంతరాలల్లో ఏదో ఒక శుభ్రజ్యో్త్న నడయాడిన క్షణాలను ఒడిసి పట్టినప్పటి అదృష్టం. ఓం ప్రథమం అనదగ్గ వినిర్మల, అలౌకిక చ్ఛాయ కు ఆధారమైన బీజాక్షరాలు వినిపించినప్పటి తన్మయత్వం. ఇక్కడ అరుదెంచిన మానవుడు మరెక్కడా ఇంత వినయ విధేయతలతో కానరాని స్థితికి పారవశ్యం. అందుకే ఇదొక దర్శనం. మానవుడి ప్రయత్నమంతా నిమిత్తమైన అరుదైన బతికిన క్షణాలు- ప్రణామములు.

+++

“మతమే రాజ్యమేలుతూ ఉన్నప్పడు ఆధ్యాత్మిక స్రవంతి ఎక్కడ కానవస్తుంది లే’ అనుకుంటాం. కానీ, “గోవిందా…గోవిందా’ స్మరణల మధ్య మనిషి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒకపరి లయతప్పి మళ్లీ స్థిరపడి సజావుగా సాగే అపురూప లోగిలి ఒకటి ఉన్నదని, మనసు నిమ్మళించిన వైనము…

ఇక్కడికి మనిషి కలివిడిగా వచ్చినప్పటికీ మళ్లీ ఏకాకి అయి, ఒంటరి ముద్రలో తన హృదయమే తాను వింటున్నప్పటి, వినడమూ మరచి దైవంలో లీనమైతున్పప్పటి, లీల గోచరమైనప్పడు సందేహాలు తెల్లబోయినప్పటి చిత్రములెన్నో…

కులమూ మతమూ లింగమూ… అలాగే, రాజూ పేదా అన్న స్థాయి భేదాలులేని  ప్రపంచం ఒకటి, కొన్నిలిప్తలే కావచ్చును, ఒకానొక బహిరంగ ఉద్యమమై గోచరించడం, ఒకరి వెనుక ఒకరు,ఒకే ఒక క్రమంలో, ఒక ‘మార్చ్’ అయి, ఒకే నిష్ఠతో నడవడం, మళ్లీ అంతా ఒకే చోట ఆగిపోయి దర్శనం చేసుకోవడం, ఇదంతా అవలీలగా కెమెరా కన్ను  దర్శించడం…ఓ గొప్ప అనుభవం.

+++

తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక సాయంత్రం ఇదే పని…
సుమారు ఒక వేయిమందిని అయినా చూసి ఉంటాను. “చూడటం’ అని ఎందుకు అనడం అంటే మామూలుగా చూస్తే కంటికి కనిపించనిది, కెమెరా గుండా భక్తులను, వాళ్లు లీనమయ్యే తీరుతెన్నులను, వ్యూ ఫైండర్ నుంచి చూడటం అంటే నిజంగా అదీ చూపు. అది మార్పు కాదు, ప్రతిబింబం కాదు, కేవలం గాజు. అటూ ఇటూ కన్నూ, చూపు ప్రసారమయ్యే కేవలం దర్శనం, దివ్య దర్శనం.

అది లౌకికం కాదు, అలౌకికమే.  అదొక ఆశ్చర్యం, ఆనందం. an exposure.
కెమెరా కంటితో పొందిన బ్రహ్మానందం. development. కండ్లు తెరవడం అంటామే! కెమెరాతో తేరుకోవడం!

+++

చేతులు జోడించి ఒకరు, కన్నార్పకుండా మరొకరు.
కంట కన్నీరొలికి ఒకరు. ఆనందభాష్పాలతో మరొకరు.
కరుణ, ప్రేమ, భయవిహ్హలత….అంతేనా? కుతూహలం, ఆనందం, తృప్తినూ.
తల తిప్పుకున్నవారూ ఉన్నారు, దైవాన్ని చూడలేక!
లీనమైన వాళ్లూ ఉన్నారు, మళ్లీ జీవన సమరాన్ని ఈదలేక!

గంపెడు పిల్లలున్న తల్లీ ఒక్కత్తే…అష్టదరిద్రం అనుభవిస్తున్న మధ్య వయస్కుడూ… ఒక్కడే… అంతా సమూహంలో ఏకాంత ప్రపంచం. దంపతులు దంపతులూ కాదు. భర్త భర్తా కాదు. దగ్గరితనం అంతా దైవంపైనే. అతడే బిడ్డా, తండ్రీ! అంగీకారం కుదిరేదాకా మనిషి లోవెలుపలా ఒక పెనుగులాట. తర్వాత శాంతి, ప్రేమ…
లీనమయ్యారా ఇక  భక్తుడికి భగవంతుడికీ మద్య ఒకే ఒక ఆత్మానుగత వారధి….వర్దిల్లే దయాపారావతం…లీలామృతం.

చిత్రమేమిటంటే అందరూ అపరిచితులే. అంతా ఒక మరుపు. దర్శనం సమయంలో మైమరుపు. అదే అపూర్వం. విశ్వాసమే బలమై అంతా మోకరిల్లడమే. దైవం చెంత అందరూ మానవులైన వాళ్లే… కంటి ముందు కెమెరా వెలిగించి చూస్తే అందరూ భక్తులైన వాళ్లే.

వాహనంలో వేంకటేశ్వరస్వామి నిదానంగా ఊరేగుతూ ఉంటే ఆదర్శాలు లేవు. ఆశయాలు లేవు. విశాలత్వం లేదు, సంకుచితత్వమూ లేదు. అంతా ఒకే ప్రపంచం. తారతమ్యంలేని ప్రాపంచికత్వం. ఒక్కొక్కరూ హారతి కర్పూరంలా దహనమైతున్న వాళ్లే.

అదేం విశేషమో గానీ, అది మహత్యమే! మనిషి దైవం చెంత నిమిత్తమయ్యే మహా ఛాయాచిత్ర లేఖనం అది!

capture చేస్తున్నది మనిషినా దైవాన్నా మెలమెల్లగా అర్థమవుతున్నది!

ధన్యుణ్ని, ఒక ఘడియకైనా!
ఏ గడియలూ లేని కెమెరా కారణంగా!

 ~ కందుకూరి రమేష్ బాబు

మీ మాటలు

  1. వండర్ఫుల్ అండి.

మీ మాటలు

*