“నయ్ చోడేంగే నయ్ చోడేంగే
హైద్రాబాద్ నయ్ చోడేంగే
నయ్ చోడేంగే నయ్ చోడేంగే
హైద్రాబాద్ నయ్ చోడేంగే ”
తుంగభద్రా నది గట్టున నినాదాలు దద్దరిల్లిపోతున్నాయి. చేతులు ‘లేదు లేదు’ అన్నట్లుగా వూపుతూ వుద్రేకంతో వూగిపోతున్నారు యువకులు. అదొక పెద్ద గుంపు. అందరూ ఎంతో ఆందోళనతో వున్నట్లు వాళ్ళను చూస్తే తెలుస్తుంది. మామూలుగా అయితే ఎంతో టిప్టాప్గా తిరిగే యువకులు ఏదో పోగొట్టుకున్నట్లు, మాసిన బట్టలతో, మాసిన గడ్డాలతో దిగులుగా, వుక్రోషంగా, ఆగ్రహంగా చెప్పలేనంత దుఃఖంగా కన్పిస్తున్నారు. నిజానికి వాళ్ళు యేం పోగొట్టుకున్నారో వాళ్లకు తెలిసినట్లు లేదు. వాళ్ల చేతుల్లో ఒక పెద్ద బ్యానర్. జై సమైక్యాంధ్ర అని రాసి ఒక మూల అర్ధనగ్నంగా వున్న పొట్టిశ్రీరాముల్ని ముద్రించింది.
ఆ గుంపులోంచి పదహైదు – ఇరవై మంది బిలబిలమంటూ నదిలోకి దిగి బాగా లోఫలివరకూ భుజాలు మునిగేవరకూ వెళ్ళారు. నినాదాలు చేస్తూనే వున్నారు. ఒకరిద్దర్ని ప్రవాహం తోసేసింది. పక్కనవాళ్లు పట్టుకున్నారు. “జాగ్రత్త జాగ్రత్త.. మరీ లోపలికి వెళ్ళొందండి” గట్టు మీద నుంచి అరుపులు. “మునిగితే మునిగితిమిలే. రాష్ట్రమే మునిగిపాయ. మా ప్రాణాలెంతగానీ, యిట్లన్నా తెలుస్తుందిలే జనాలకి, ముఖ్యంగా తెలంగాణావాళ్లకి” అంటున్నారు నీళ్లలోని వాళ్ళు.
“నయ్ చోడేంగే నయ్ చోడేంగే; హైద్రాబాద్ నయ్ చోడేంగే
జిందాబాద్ జిందాబాద్; సమైక్యాంధ్ర జిందాబాద్ ”
నినాదాలు ఆగడం లేదు. నాలుగైదు టీవీ కెమెరాలు దీన్నంతా చిత్రీకరిస్తున్నాయి. పది పదహైదు నిమిషాల తర్వాత టీవీల వాళ్లు వెళ్లిపోయారు. నీళ్ళలోకి దిగిన నిరసనకారులు చాలాసేపు అదే నినాదాలు, అంతే పట్టుదలగా అరచి అరచి గొంతులు బొంగురుపోతున్నాయి. గట్టుమీద వున్నవాళ్ళూ యిక చాలు రమ్మంటున్నారు.
ఇదంతా గమనిస్తున్న ఒకతను ఆ గుంపుకు లీడర్గా కన్పిస్తున్నతని దగ్గరకు పోయి “యిదంతా ఏందన్నా…?” అనడిగాడు. చుట్టూ చేరినవారందరూ అతన్ని పిచ్చోణ్ణి చూసినట్లు చూసారు.
“ఇరవైరోజులాయ జరగవట్టి. సమైక్యాంధ్ర వుద్యమం యేందన్నా అంటావ్. యీ లోకంలో వున్నావా లేదా…?” గద్దించాడు లీడర్.
“అవునన్నా.. మరి యిదేందన్నా నీళ్ళలోకి దిగినారు. యీ నీళ్ళు యాడికి పోతాయన్నా..?”
ఎవడో వీడు పూర్తి పిచ్చోడు మాదిరి వున్నాడే. సమైక్యాంధ్రను అర్ధం చేయిస్తామంటే నీళ్లు యెక్కడీకి పోతాయని అడుగుతున్నాడు అనుకొని, “ఏమయ్యా! యిది తుంగభద్ర, యీ నీళ్లు నేరుగా కృష్ణానదిలో కలుస్తాయి. అవి శ్రీశైలం డ్యాంలో పడతాయి..”
“శ్రీశైలం డ్యాం నుంచి యాడికి పోతాయన్నా..?”
“ఓర్ని అది కూడా తెలీదా? ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా నేరుగా నాగార్జునసాగర్లో పడి, అక్కడ్నుంచీ కాలవల్లో పడి పొల్లాల్లోకి పోయి పంటలు పండిస్తాయి.”
“ఎవురి పంటలన్నా?”
“ఎవరి పంటలా? రైతులవిరా. మన సమైక్యాంధ్ర రైతులవిరా…”
” ఆ రైతుల్లో రాయలసీమోళ్ళు ఎవరన్నా వుండారాన్నా?”
“రాయలసీమోళ్ళా.. మన పొలాలు ఆడెందుకుంటాయిరా.. మన పొలాలు యీడ కదా వుండేది..”
“మల్లా… మన పొలాలు యీడుంటే, నీళ్ళు యీడ్నించీనే పోతావుంటే మన నీళ్ళు మన పొలాలకి పెట్టుకోకుండా నీళ్ళెందుకు వదుల్తుండారన్నా.. నయ్ చోడేంగే నయ్ చోడేంగే కృష్ణాజలాలు నయ్ చోడేంగే అనాలకదన్నా. యాడోవుండే హైద్రాబాద్ను నయ్ చోడేంగే నయ్ చోడేంగే అంటుండారే? మల్లా యీడుండే నీళ్లను మాత్రమే హమ్ కైసే చోడేంగే అన్నా…”
గుంపుకూ, లీడర్కూ ఒక్కసారిగా అయోమయంగా అన్పించింది.”మనది ఒకటి పోగొట్టుకొని, మనది కానిదాన్ని వెతుకుతున్నామన్నా. సమైక్రాంధ్రలో పడి రాయలసీమను మరిచిపోయినామన్నా…”
“నిజమా..?” అన్పించింది వాళ్లకు.
బాగా చెప్పారు….ఇదీ సంగతి
అక్షరాలా నిజం. అసలు మనం ఎందుకు కొట్టుకున్తున్నాము? అర్ధమయ్యేలా వివరిస్తారా?