మూడు జ్ఞాపకాలు- మూడు సాహసాలు!

ఈ రోజెందుకో బాల్యంనాటి సాహసాలు గుర్తుకు వచ్చాయి. నిజానికి అవి సాహసమేమీ కావు. అయినా ఆ వయసురీత్యా సాహసమనే చెప్పాలి.

అలాంటి మూడు సంఘటనలు.

నిజానికి ఇవి ఏకోవలోకి వస్తాయో  అని ఎప్పుడూ సందేహమే!

1

వయస్సు సరిగ్గా  గుర్తులేదు. బహుశ ఇంకా స్కూలుకు వెళ్ళటంలేదు. అప్పట్లో వయస్సు ఆరో సంవత్సరం వస్తేగాని బడిలో చేర్చుకునేవారు కాదు.

స్థలం మాత్రం పోలవరం (పశ్చిమగోదావరి జిల్లా). మా రూతు ఆంటీ 12వ తరగతి చదువుతుండేది. మా యిల్లు ఉన్నతపాఠశాల ఎదురుగా వుండటంవల్ల ఆంటీ వాళ్ళ స్నేహితురాళ్ళు తరచూ వచ్చి మంచినీళ్ళు త్రాగి వెళ్ళేవారు. అలా వచ్చేవాళ్ళలో   పురుషోత్తపట్నానికి చెందినవారు వుండేవారు. పురుషోత్తపట్నం (తూర్పు గోదావరి జిల్లా)  అంటే పోలవరం గోదావరికి ఆవలి ఒడ్డునవుంది. ఆ గ్రామంనుండి  ప్రతిరోజూ పడవపై వచ్చి,  వెళ్ళేవారు.

ఓ రోజు ఒకరి ఇంట్లో ఎదో కార్యక్రమం (నాకు సరిగ్గా గుర్తులేదు) ఉండటంవల్ల అందరూ కలిసి వెళ్ళాలని మాట్లాడుకుంటున్నారు. అందులో ఆహ్వానం మా ఆంటీకి కూడా వుంది. ఆ మాటలు విన్న నేను, నేనూ వస్తానని  చెప్పాను. నువ్వు సిద్ధంగావుండు మేము వచ్చి తీసుకెళతాము అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు పడవ ప్రయాణం అంటే మహా సరదా. పోలవరం (పశ్చిమగోదావరి జిల్లా) పురుషోత్తపట్నం (తూర్పు గోదావరి జిల్లా) రెండు ఎదురెదురు ఒడ్డుల మధ్య ఎక్కువ వెడల్పువున్న రేవులని చెబుతారు. కొవ్వూరు రాజమండ్రిల మధ్య వెడల్పు ఎక్కువవున్నా రేవులు మాత్రం ఎదురెదురుగా లేవు.  ఇంతకుముందు ఒకసారి ఆంటీయే తన క్లాస్మేట్ ఇంటికి తీసుకెళ్ళింది.  అందుకని చకచకా సిద్దమయ్యి, చాలాసేపు ఎదురుచూసాను. ఎవ్వరు రాలేదు. ఒకవేళ నన్ను మర్చిపోయి పడవల రేవుకు వెళ్ళారా అని సందేహమొచ్చింది. సరే! అక్కడికి వెళ్ళి  చూద్దాం  అని బయలుదేరాను.  నేను అక్కడికివెళ్ళిన సమయానికి ఒక పడవ వెళ్తూ కనిపించింది. అందులో కొంతమంది విద్యార్థునులు  కనిపించారు. నన్ను మర్చిపోయారేమో అనే సందేహం ఎక్కువయ్యింది. అక్కడే చాలాసేపువున్నాను.solo-boat-journey

 

అప్పట్లో అటువైపునుండి ఒక  పడవ ఇటువస్తే, ఇటునుంచి ఒక పడవ అటువెళ్ళేది. అలా అటువైపు పడవ వచ్చింది. పడవవాళ్ళు లంగరులు వేసి బయలుదేరేలోపు వారి వారి పనుల్లో పడిపోయారు. నేను పడవ ఎక్కి కూర్చున్నాను. టిక్కెట్టు ఎమీ ఇవ్వకపోయినా పడవ ఎక్కిన వారిని లెక్కించుకుని, రుసుము వసూలు చేసేవారు. ఇంకా  సరుకులు, సామానులు చూసుకొని  బయలుదేరారు. ఆవలి ఒడ్డు రాగానే  నేను పరుగెట్టుకుంటూ నాకు తెలిసిన ఇంటికి వెళ్ళాను. అక్కడ సందడైతే వుంది కాని, వీళ్ళు ఇంకా రాలేదని తెలిసింది. వస్తారులే అనే ధీమా ఒకవైపు, వస్తారా రారా అనే సందేహం మరోవైపు. అలా ఆ వీధిలో నాలుగు అడుగులు వేసేసరికి గోళీలు ఆడుతూ కొందరు పిల్లలు కనిపించారు. అక్కడికి పడవరేవు కనబడుతూనేవుంది. అటువైపు ఓ కన్నేస్తూనే  మెల్ల మెల్లగా వారితో కలిసిపోయాను. ఎంతసేపు అలా ఆడుతూ ఉన్నానో గుర్తులేదు గానీ కొంచెం చీకటి పడుతున్న సమయంలో ఒక పడవ వచ్చింది. అందులో మా ఆంటీ ఇంకా తన స్నేహితురాళ్ళు ఉన్నారు. నన్ను అక్కడ చూసి ఆశ్చర్యపోయారు.  ఆంటీకి భయం మొదలయ్యింది ఇంటి దగ్గర నా గురించి ఏమి కంగారు పడుతున్నారోనని. తన ఫ్రెండ్సు అనునయిస్తున్నా భయంగానే సమయం గడిపింది.

ఆఖరి పడవకు పురుషోత్తపట్నంనుండి  పోలవరం వచ్చేసాము. ఇంటికి వెళ్తే ఎవ్వరు కంగారు పడటంలేదు ఎందుకంటే నేను ఆంటీతోనే వెళ్ళానని అనుకున్నారు. అప్పుడు ఆంటీ స్థిమితపడింది.

నాకు మాత్రం పడవ ప్రయాణం అనగానే అదే గుర్తుకొస్తుంది.

 

2

1966, పాత పట్టిసం, పోలవరం తాలూకా, పశ్చిమ గోదావరి జిల్లా.

గోదావరిలో శివాలయంవున్న ఊరుగా ప్రసిద్దమైనది.

అక్కడ ఎలిమెంటరీ స్కూలు ఉంది. బహుశ 3వ తరగతి చదువుతున్నాను. అందులో మా పెద్ద ఆంటీ  కటాక్షమ్మ ఉపాద్యాయురాలుగా పనిచేస్తుండేది. నేను చిన్నక్క మేరీ సలోమి, 5వ తరగతి చదువుతూ ఆమెవద్ద ఉండేవాళ్ళం.  అదే బడిలో ఆంటీతో పాటు  శ్రీమతి శాంతమ్మ, లిల్లీ  అని ఇద్దరు  ఉపాద్యాయురాళ్ళు వుండేవారు.

మంగళవారం 4కి.మీ. దూరంలోవున్న పోలవరంలో సంత జరిగేది. అందుకని మంగళవారం స్కూలుకు మధ్యాహ్నంనుండి శెలవు వుండేది.

లిల్లీ గారు తన తమ్ముడు వివాహానికని పత్రిక ఇచ్చి పెళ్ళిపనుల నిమిత్తం శెలవుపెట్టారు.

ఆ రోజు మంగళవారం. మధ్యాహ్నం బడినుంచి వచ్చి కొద్దిసేపు ఆడుకున్నాక స్నానంచేసి మంచి బట్టలు వేసుకున్నాను. అంతలో ఆంటీ శాంతమ్మగారి ఇంటికివెళ్ళి ఎదో తెమ్మని పంపించింది. వారి ఇల్లు ఊరికి ఆ చివరవుండేది. నేను వెళ్ళేసరికి వారి ఇంటికి తాళంవేసివుంది. ప్రక్కన అడిగితే పెళ్లికి వెళ్ళారు అనిచెప్పారు. వెంటనే నాకు లిల్లీ టీచర్ వాళ్ళ తమ్ముడు పెళ్ళి రేపే అని గుర్తుకువచ్చింది. అక్కడికే వెళ్ళివుంటారని  అనుకున్నాను. ఆ పెళ్ళి కొత్త పట్టిసీమ అక్కడికి ఓ మూడు నాలుగు కిలోమీటర్లు వుంటుంది. గోదావరి గట్టు వారగా వుంటాయి ఆ గ్రామాలు. అప్పటికి ఇంకా చీకటి పడకపోవడంతో సరదాగా నడుచుకుంటూ వెళ్ళాను. ఇల్లు ఎలా కనుక్కున్నానో గుర్తులేదుగాని పెళ్ళి ఇంటికివెళ్ళాను    కొద్ది సేపటికి  లిల్లీ టిచరు కనిపించి  ఆంటీగురించి అడిగి తన పనుల్లో తాను కలిసిపోయింది. పెళ్ళి పందిరివేయడం, దాని డెకరేషను పనుల్లో, కాగితాలు అంటించటంలో నేనూ కొద్దిగా సహాయంచేసాను. చీకటి ఎప్పుడుపడిందో తిన్నానో లేదో తెలియదు.  కొద్ది రాత్రి అయ్యాక పెళ్ళికూతురు వచ్చింది. విడిది ఇల్లు ఇచ్చారు. ఏవేవో కార్యక్రమాలతో కొద్దిసేపు సమయం గడిచిపోయింది. విడిది ఇంటికి, పెళ్ళి ఇంటికి మధ్య తిరుగుతుంటే మగ  పెళ్ళివారు నేను ఆడపెళ్ళివారి తరుపున అనుకున్నారు.   ఆడ పెళ్ళివారు నేను మగపెళ్ళివారి తరుపున అనుకున్నారు, పెళ్ళి తంతులో పడి నాకు ఇల్లు గుర్తురాలేదు. ఆ రాత్రి పెళ్ళి పందిరిలోవున్న ఓ బెంచీపై నిద్రపోయాను.

ఉదయమే పెళ్ళి సందడి. అక్కడ నన్ను గుర్తుపట్టేవారు ఎవ్వరూ లేరు. గుర్తుపట్టగలిగే ఒక్క టీచరు చాలా పనుల్లో హడావిడిగావుంది.

పెళ్ళికూతురు తెల్లటి వస్త్రాలు, మేలిముసుగు (వెయిల్) బ్యాండు మేళాలతో పందిరిలోకి తీసుకెళ్ళడం నన్ను అబ్బుర పరిచాయి.

పెళ్ళి అయిపోయింది, భోజనాల దగ్గర శాంతమ్మ టీచరు భర్త వెంకన్న గారు (ఆయనా టీచరే) కనిపించి పలకరించారు.  ఆంటీ రాలేదా? వస్తే ఎక్కడా అని. అప్పుడు గుర్తుకువచ్చింది ఇల్లు. భోజనాల తర్వాత వెళ్ళిపోదాము అనుకున్నా. ఇంతలో వధూవరులిద్దరూ బ్యాండు మేళాలతో వీధిలో ఊరేగింపు వెళ్ళడం కనిపించింది. కొందరు పిల్లలు ఊరేగింపువెనుక నడుస్తున్నారు  ఆ గుంపులో చేరిపోయాను. ఎంత సమయం గడిచిందో గాని, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఇంటికి వెళ్ళాలనే ద్యాస పుట్టింది. మెల్లగా గోదావరి గట్టు ఎక్కాను. కొద్దిగా ప్రొద్దు గ్రుంకుతున్నది. గట్టువారగా చింతచెట్లు, మరికొన్ని చెట్లు వుండేవి.     కొన్ని చెట్లపై బ్రహ్మజెముడుపక్షి  (గబ్బిలాలు లాంటివి) వున్నాయి. అవి సాయత్రము చెట్లపై ఎగురుతూ, వాలుతూ వుంటాయి. అవి చూసేసరికి కొంచెం భయం మనసులో మెదిలింది.

ఆ భయానికి తోడు ఇంటి దగ్గర ఆంటీ కొడుతుంది అనే భయంకూడా మొదలయ్యింది. అలా భయం, భయంగా నడుస్తున్నాను. ఇంతలో మా వూరి అతను ఒకరు సైకిలుపై వెళూ నన్ను చూసి, ఇక్కడ వున్నావు ఏంటి? నీకోసం ఊరంతా వెదకుతున్నారు అని, తన సైకిలిపై ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లాడు.

ఆంటి ఈ వేళ నా తోలుతీస్తుంది అనుకుంటూ సైకిలుదిగుతుండగా నన్ను చూసి ఒకాసారిగా  పరుగెత్తుకునివచ్చి గట్టిగా పట్టుకుని ఏడ్వడం మొదలుపెట్టింది.  ఆ వెనకే నా చిన్నక్క వచ్చి తను ఏడ్వటం మొదలయ్యింది. కొడతారనుకున్న నేను ఒక్కసారిగా బిత్తరపోయాను.

 

ఇక ఇంటి దగ్గర  ఏమయ్యిందంటే :

మా వీధిలో కొందరితో కలిసి ఆంటీ పోలవరంలో వున్న, భానుథియేటర్లో సినిమాకు వెళ్ళడాన్కి  పథకం వేసుకున్నారు. నడిచివెళ్ళడం, సినిమా అయిన తర్వాత నడిచి రావడం కాబట్టి నన్ను తీసికెళ్తే నిద్రపోతే అవస్థ అవుతుందని నన్ను శాంతమ్మగారి ఇంటికి వెళ్ళి రమ్మన్నారు. నేను వెళ్ళి వచ్చేలోగా వాళ్ళు వెళ్ళిపోవాలని పథకం. అలాగే నేను వెళ్ళాక వాళ్లు వెళ్ళిపోయారు. ఇంటివద్ద వున్న చిన్నక్క నేను ఆంటీతో వెళ్ళాను అనుకుంది.

రాత్రి మొదటి ఆట చూసుకొని ఇంటికివచ్చేసరికి ఇంటివద్ద నేను లేకపోయేసరికి ఖంగారు పడ్డారు. వెదకడం మొదలు పెట్టారు. చుట్టు ప్రక్కల ఇళ్ళు, తర్వాత వీధులు. గ్రామాలు అప్పటికే నిద్రలో జోగుతుండేవి.

అప్పుడే ఒక విషయం తెలిసింది. అదేమంటే గోదారిలోవున్న గుడికి ఆ రోజు వుదయం సినీనటుడు ఎన్.టి. రామారావు వచ్చి వెళ్ళాడని. ఆయన్ని చూడడాన్కి   జనాలు ఎగబడ్డారని. అందరిలో ఒక భయం పొడసూపి పలు అనుమానాలు తలెత్తాయి. గోదావరిలో గాని నేను పడిపోయానేమో అనే అనుమానంతో  వెదకులాట గోదావరి తీరాలగుండా సాగింది.

అప్పట్లో మరోవదంతులు కూడా వుండేవి. పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు తిరుగుతున్నారని. ఇలాంటి రద్దీ సమయాలలో వారి చేతివాటం చూపిస్తున్నారని.

చుట్టు ప్రక్కల మాకు బంధువులు వుండే, దొండపూడి, పోలవరం నేను ఆంటి తరచూ వెళ్ళే గృహాలన్నింటికి వెళ్ళి అక్కడికి గాని వెళ్ళానేమోనని వెదికారు.

లిల్లీ టీచరు గారి తమ్ముడి పెళ్ళివిషయం వారికి గుర్తుకు రాలేదు. ఇంతకుముందెప్పుడూ వారి ఇంటికి వెళ్ళలేదు కాబట్టి సందేహం కూడా రాలేదు.

 

3

1969 కొవ్వూరు, పశ్చిమగోదావరి జిల్లా.

నాన్న గారికి కొవ్వూరు బదిలీ అయిన తర్వాత స్కూలు సీట్ల సర్దుబాటు తర్వాత మొత్తం కుటుంబం, రైల్వే స్టేషను దగ్గర్లోని నాదెండ్లవారి వీధిలో అద్దెకు  వుండే వాళ్ళం.

పెద్ద అన్నయ్య రాజమండ్రి , ఆర్ట్స్ కాలేజీలో బి.ఎ. చదువుతుండేవాడు. కొవ్వూరునుండి రోజూ రైలులో వెళ్ళేవాడు.

పెద్దక్క సునీతి, చిన్న అన్న లింకన్ 8వ తరగతి, చిన్నక్క 7వ తరగతి హైస్కూలులో జాయిన్ అయ్యారు.  నన్ను దుంపల బడి అని ఒక స్కూలు 5వ తరగతి లో చేర్చారు (ఈ సంగటన జరిగిన తర్వాత నన్ను మళ్ళీ పట్టిసం పంపేసారు, అందువల్ల స్కూలు పేరు గుర్తులేదు)

కొవ్వూరుకు ప్రక్కనేవున్న   పశివేదలలో మావయ్య వుండేవారు.  ఆయన రైల్వేలో పనిచేసేవారు.

ఓ రోజు మధ్యాహ్నం మావయ్య మాయింటికి వచ్చారు. పెద్దక్క, చిన్న అన్నయ, చిన్న అక్క పశివేదల వస్తామని మావయ్యకు చెప్పారు. సాయంకాలం స్టేషనుకు వచ్చేయండి అక్కడనుండి కలిసివెళదాం అనిచెప్పి మావయ్య వెళ్ళిపొయాడు. అక్క వాళ్ళతో నేనూ వస్తానని చెప్పాను. సరే తయారయ్యివుండు,  బజారుకు వెళ్లి వస్తాము అని వెళ్ళిపోయారు. నేను సిద్దపడి ఎదురుచూడటం మొదలుపెట్టాను.  ఎంతసేపటికి రాకపోయేసరికి స్టేషనుకు వెళ్దామని బయలుదేరి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి మేము  వెళ్దామనుకున్న పాసింజరు రైలు అప్పుడే వెళ్తూ కన్పించింది. ఆ రైలులో వెళ్ళిపోయివుంటారని అనుకున్నాను. నన్ను వదిలి వెళ్ళిపోయాయారు అని ఏడ్పువచ్చింది. రైలుపట్టాలవెంట నడిచివెళ్తే మూడు కిలోమీటర్లు వుండవచ్చు. ఇంతకుముందు ఒకసారి వెళ్ళిన గుర్తు. వెళ్దామని పట్టాలవెంట నడక మొదలుపెట్టాను. మద్యలో కొంగలబాడవ అనే వంతెన వుంది దానిపై దాటదానికి భయంవేసి ఆగిపోయాను. కొద్దిసేపటికి ఒకామె(బహుశ నర్సు అనుకుంట) డ్యూటీనుంచి వస్తూ, రైలు దాటిపోవడంవల్ల ఆమె నడిచి వెళ్తుంది. ఆమె నన్ను వంతెన దాటించింది.

పశివేదల స్టేషనులో దిగితే ప్రక్కనేవున్న రైల్వేక్రాసింగు  గేటు ముందుగా వెళ్తారు అందరు. అక్కడ బంధువు ఆయన కూడా (మావయ్య వరుస)  వుండేవారు. ఆయన గేటు ఆజమాయిషీతోపాటు, టిక్కెట్లను వసులు, తనిఖీ చేసేవాడు.

నేను రైలుపై రాలేదు కాబట్టి అడ్డదారిలో ఇంటికి వెళ్లిపోయాను.  అత్తయ్య గాని, మావయ్య గాని నా రాకను పెద్ద అనుమానంగా చూడలేదు. మిగతా పిల్లలు ఎందుకు రాలేదో రేపు అటువైపు వెళ్ళినప్పుడు కనుక్కుంటాలే అన్నాడు. అలాగే ఉదయమే ఆయన డ్యూటీకి, అత్తయ్య కూడా పనిలోకి వెళ్ళిపోయారు. నా వయసుదే అయిన వదిన కూడా బడికి వెళ్ళిపోయింది. నేను వచ్చినది  సాయంకాలం అవటంవల్ల రెండు రాత్రులు గడిచాయనుకుంట.

ఒక్కడ్నే గదిలో కూర్చొని ఆడుకుంటున్నాను. ఇంతలో పెద్ద అన్నయ్య, పెదనాన్నగారి అబ్బాయి ఇద్దరూ కలిసి వచ్చారు. ఒక్కసారిగా నన్నుచూసి ఆశ్చర్యపోయారు. వెంటనే నన్ను తీసుకొని కొవ్వూరు ఇంటికి వెళ్ళారు.

 

 

ఇక ఇంటి దగ్గర  ఏమయ్యిందంటే :

అక్కవాళ్ళు బయటికివెళ్ళి వచ్చేసరికి సమయం లేకపోవడంవల్ల ఆ రోజుకు ప్రయాణాన్ని వద్దు అనుకొని ఇంటికి వచ్చేసారు.  మొదట పిల్లలతో ఆడుకోవట్డానికి ఎటైనా వెళ్ళివుండవచ్చనుకున్నారు. చీకటైనా రాకపోయేసరికి ఆందోళన మొదలయ్యింది. అందులోనూ పిల్లల్ని ఎత్తుకెళ్ళేవాళ్ళు రకరకాల రూపంలోనూ, సాధువులుగానూ తిరుగుతున్నారనే రకరకాల పుకార్లు వుండేవి. అవి నిజమో కాదో నాకు అంతగా గుర్తులేదు.

మొదట మా చుట్టుప్రక్కల వీధుల్లో వెదికారు. కొవ్వూరులొనే లూథరన్ చర్చి దగ్గరలో  మా పెదనాన్నగారు వుండేవారు.  అక్కడికి గాని వెళ్ళానేమో అని చూసారు. అక్కడ కనబడలేదు. పశివేదల వెళ్ళేవిషయం తెలిసేసరికి వెళ్ళివుంటే గేటు దగ్గర వుండే మావయ్యకు కనబడతారు కదా అందుకని కొవ్వూరు స్టేషను నుంచి ఫోను చేయించి  అడిగితే నేను చూడలేదు అని, వస్తే కన్పడకుండా ఎలావెళ్తాడు అని  చెప్పారట. దానితో పశివేదల రాలేదని అనుకున్నారు.

పెద్దన్నయ్య, మోషే, లివింగష్టన్ (ఇద్దరూ పెదనాన్న గారి పిల్లలు) అన్నయ్యలు మిగతా స్నేహితులు కలిసి రాత్రంతా వీధి, వీధి వెదికారు.

గోదావరి ఒడ్డున గోపాదాల రేవు వద్ద కొన్ని గుడులున్నాయి. అక్కడ సాధువులు, బిచ్చగాళ్ళు రాత్రిళ్ళు పడుకునేవారు. ఒకొక్కరిని లేపి, ముసుగుతీసి మరీ వెదికారట.  ఎవరెవర్నె లేపారో, దుప్పటి లాగి చూసారో చాలా కాలం కథలు కథలుగా చెప్పుకునేవారు మా అన్నయ్య వాళ్ళ స్నేహితులు

మరసటిరోజు పోలీసు కంప్లయింటు ఇచ్చారట. కొవ్వూరు రైల్వేస్టేషను, రాజమండ్రిలోని గోదావరి, రాజమండ్రి స్టేషనులోనూ వెదికారట.

నిడవోలులో రైల్వేస్టేషనులో ఓ పిల్లాడు దొరికాడని బాగా ఏడుస్తున్నాడని తెలిసిందట. ఆ సమయంలో కొవ్వూరునుండి నిడదవోలుకు రైలు ఏవీ లేకపోవడం, మా అన్నయ్య వాళ్ళు పశివేదలవచ్చి కొంచెం ఏదైనా తిని, ఓ గంట తర్వాత వున్న రైలుకు వెళదాం అని పశివేదల వచ్చారు.

అలా వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోక ఏమి చేస్తారు.

***

ఇక్కడే కొవ్వూరులో వుంటే మళ్ళీ ఏమి చేస్తాడొనని మళ్ళీ నన్ను కటాక్షమ్మ ఆంటీ దగ్గరకు పాత పట్టిసం పంపేసారు.

– జాన్ హైడ్ కనుమూరి

john hyde

మీ మాటలు

  1. Srinivasa Gupta Chunduri says:

    నీ సాహసాలు చాల బాగున్నాయి

  2. మీ బాల్య స్మృతులు బాగున్నాయి సార్. అలా ఆడుకుంటూ కలగలసిపోతూ చివర్లో ఇంట్లో వాళ్ళని కంగారు పెడ్తూ చేసిన సాహసాలు బాగున్నాయి..

మీ మాటలు

*