మనసుకి బాధ కలిగితే కవిత్వం వస్తుందంటారు. కానీ శరీరానికి బాధ కలిగితే కూడా కవిత్వం వస్తుంది అన్న నానుడి నేను ఎక్కడా వినలేదు. అయితే , శరీరానికి కలిగే బాధలు ఎంత చిన్నవైనా, ఎంతో కొంత మన ఉత్సాహాన్ని , శక్తిని తగ్గిస్తాయి. రోజువారీ దినచర్య కొంత నత్త నడక సాగుతుంది. అదే ఏదైనా భరించలేని నొప్పి వచ్చిందంటే ఇంక చెప్పేదేముంది? తప్పని బాధ్యతలు ముక్కుతూ మూలుగుతూ పూర్తి చెయ్యాల్సి వస్తుంది. చేసే పనిలో ఉత్సాహం , తపన కరువై , తప్పదురా భగవంతుడా అనుకుంటూ చేస్తాం. మొత్తానికి ఏ చిన్న అనారోగ్యమైనా మన కేంద్రీకరణ శక్తిని తగ్గించేసి అలవాటుపడిన దినచర్యకి ఆటంకం కలిగిస్తుంది.
అలా కాకుండా అమితమైన మనోబలం ఉన్న కొద్ది మంది మాత్రం పెద్ద పెద్ద అనారోగ్యాల్ని కూడా త్రుణప్రాయంగా తోసేసి వీలైనంతవరకు అవి తమ కార్యకలాపాలను ప్రభావితం చెయ్యకుండా చూసుకుంటారు. ఇది అరోగ్యకరమైన శక్తి. అలాంటి మనోబలం, మనో నిబ్బరం పొందాలని ఎవరికుండదు? అందుకే చిన్న చిన్న నొప్పులకి సైతం నీరుకారిపోయే కొంతమంది ధ్యానం ద్వారానో, యోగా ద్వారానో అలాంటి మనోబలాన్ని పొందాలని ఆరాటపడుతూంటారు.
అయితే కవిత్వానికున్న శక్తి కూడా అలాంటిదే అని నాకనిపిస్తుంది. మానసికోల్లాసం ద్వారా శారీరక వికాసం కవిత్వం కలిగిస్తుందనేది స్వీయానుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. అచ్చంగా అలాంటి అనుభవమే విన్నకోట రవి శంకర్ గారి “బాధ” కవిత మొదటి సారి చదివినప్పుడు నాకు కలిగింది. ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు మన శారీరక, మానసిక స్థితి ఎలా ఉంటుందో చాలా తేలికైన భాషలో కవిత్వీకరించారు. శారీరక బాధ అనేది ఎప్పుడో అప్పుడు ప్రతి ఒక్కరూ అనుభవించే ఉంటారు కాబట్టి ఈ కవిత చాలా తేలికగా మనసుకి హత్తుకుపోతుంది. అంతే కాదు, ఒక్కసారి గుర్తుచేసుకుంటే అలాంటి బాధలనుంచి తాత్కాలిక ఉపశమనాన్నిచ్చి మొరాయించే శరీరానికి నూతనోత్సాహానిస్తుంది.
కవి ఈ కవితలో చెప్పినట్టు
“మనసు బాధని మరొకరితో పంచుకోవచ్చు
శరీరం బాధని మాత్రం
ఎవరికి వారే మోసుకోవాలి
ఎదురైన ఏ సుఖాన్నైనా
వద్దని ఒదులుకోవచ్చుగానీ,
బాధని కాదనటానికి కూడా వీలుండదు. “
కాబట్టే, బాధను ఉపశమింపజేసే సాధనాల్లో ఈ కవిత కూడా ఒకటయిందంటాను. ప్రతి మనిషీ నొప్పి కలిగినప్పుడు ఇదేరకమైన బాధని అనుభవిస్తాడు. అలాంటి బాధని ఇలా కవిత్వరూపంలో చూసుకోవడం ఒక చిత్రమైన అనుభూతి. పెదవులపై చిరునవ్వులు పూయించి బాధని కాసేపు మర్చిపోయేలా చేస్తుందీ కవిత.
అంతా సవ్యంగా ఉన్నంతసేపూ
అన్ని వైపులా పాదులా అల్లుకుపోయే శరీరం
ఏ చిన్న భాగం ఎదురు తిరిగినా
బాధతో లుంగలు చుట్టుకుపోతుంది.
వేల ఆనందపుష్పాలు
విరబూసే శరీరవృక్షం
ఒకే ఒక బాధా విషఫలంతో
వాటన్నిటినీ రాల్చుకొంటుంది.
శరీరం వీణ మీద
ఒకో చోట సుఖం ఒకోలా పలికినా,
బాధ మాత్రం అన్ని చోట్లా
ఒకలాగే పలుకుతుంది.
సుఖాన్ని మించిన సుఖం ఉందనిపిస్తుంది గానీ,
ఏ బాధా మరొక బాధకి తీసిపోదు.
చుట్టూ ఉన్న ప్రపంచం తన అందాన్ని
అతి తేటగా ప్రకటిస్తున్నప్పుడు
ఒక్క బాధ చాలు –
కళ్ళకి కన్నీటి తెరకట్టి
మొత్తంగా దానిని మసకబరుస్తుంది.
మనసు బాధని మరొకరితో పంచుకోవచ్చు
శరీరం బాధని మాత్రం
ఎవరికి వారే మోసుకోవాలి
ఎదురైన ఏ సుఖాన్నైనా
వద్దని ఒదులుకోవచ్చుగానీ,
బాధని కాదనటానికి కూడా వీలుండదు.
మనసు ఒప్పించలేని
మనిషి చివరి ఒంటరితనాన్ని
శరీరం ఒక బాధాదీపపు వెలుతురులో
సరిపడా రుజువుచేస్తుంది.
– ప్రసూన రవీంద్రన్
చాలా బాగా విశ్లేషించారు ప్రసూన. కవితని, అందులోని బాధను. విన్నకోట రవిశంకర్ గారు నాకు నచ్చిన కవుల్లో ఒకరు. ఈ కవిత కూడా అంతే బాగుంది. అభినందనలు