ఏడు రంగుల ఇంద్రధనస్సు “ సప్తపర్ణి”

Saptaparni cover page చిత్రలేఖనం, ఛాయాగ్రహణం , ఇంకా చలనచిత్రాల పై అనేక  వ్యాసాలున్న  ‘సప్తపర్ణిపుస్తకావిష్కరణ సభ ఇటీవల  హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ దూర దర్శన్ మాజీ అధికారి, ప్రయోక్త  వోలేటి పార్వతీశం సభ ను నిర్వహించారు.  మాజీ పోలీసు అధికారి చెన్నూరి ఆంజనేయరెడ్డి  అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆంజనేయరెడ్డి పుస్తకావిష్కరణ చేసాక మాట్లాడుతూమిసిమి, భూమి పత్రికలలో ప్రచురించబడిన కాండ్రేగుల నాగేశ్వరరావు వ్యాసాలు ఇప్పుడు పుస్తకరూపంలో సప్తపర్ణిగా మనముందున్నాయి. కళలను బోధించే ఉపాధ్యాయులకు   పుస్తకం విజ్ఞానదాయినిగా ఉండగలదు. కళ మీద వ్యాసాలు రాయడం  మొదలెట్టింది సంజీవదేవ్. తరువాత నాగేశ్వరరావు ప్రభృతులు. నిజానికి  మాజిక్ రియలిజమ్  గురించి సరళంగా వ్రాయటం ఒక కళ. హైదరాబాదు నగర ప్రభావంతో ఇక్కడివారికి కళ, శిల్పాలపై ఆసక్తి కలుగుతోంది. కష్ట నష్టాలకోర్చి, కళాజ్యోతి బాపన్న మిసిమి మాస పత్రిక, ఇంకా ఇతర పుస్తకాలు వెలువరిస్తున్నందుకు నా అభినందనలుఅంటూ తమ అధ్యక్షోపన్యాసం చేసారు.

వోలేటి పార్వతీశం మాట్లాడుతూ సప్తపర్ణి అంటే ఏడు ఆకులని ,ఏడు అంశాల కలయికే సప్తపర్ణి అని చెప్పారు. సృజన, కళారాధన, కళా సమీక్ష, చిత్రకళ, శిల్పకళ, చలనచిత్ర కళ, వ్యాస రచనల కలయికే ఈ సప్తపర్ణి అని వివరించారు.

శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ వాణీ దేవి మాట్లాడుతూ ” కళలపై ఆంగ్లంలో చాలా పుస్తకాలుంటాయి కాని తెలుగు లో బహు తక్కువ. లలిత కళలపై  చక్కటి పుస్తకాన్ని వ్రాసి, ఒక చిత్రకారుడు చేయలేని పనిని  నాగేశ్వరరావు చేసి చూపారు. లలిత కళలపై అవగాహనకు, ఈ పుస్తకం విద్యార్థిలోకానికి దోహదపడకలదు. చిత్రకారుల జీవితం, వారు చిత్రాలను గీయటానికి ప్రేరకమేది, డాడాయిజం వగైరాలను సులభ శైలిలో నాగేశ్వరరావు చెప్పారు. హిట్లర్ ఆధునిక కళలపై ఏహ్యభావం కలిగున్నవాడై, అటువంటి చిత్రాలను వెంటాడి, వాటిని తగులబెట్టించిన విషయం, హిట్లర్ గురించిన వ్యాసం లో మనము చదవవొచ్చు. కొందరి చిత్రాకారుల చిత్రాలు అమ్ముడుపోని స్థితి నుంచి మరికొందరి చిత్రాలు లక్షలు, కోట్ల రూపాయలలో అమ్ముడుపోవటం దాకా మనము గమనించవచ్చు. లెయొనార్డొ విన్సి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. అతను ఫ్లూట్ చక్కగా ఊదుతాడు. గాలిలో ఎగరటం వగైరా శాస్త్రీయ విషయాలపై చిత్రాలు గీసాడు. ఛాయాగ్రహణం, సాలార్ జంగ్ సంగ్రహాలయం , వంగ చిత్రకళారీతులు వగైర అంశాలపై పెక్కు వ్యాసాలున్నాయి సప్తపర్ణి లో ” అని చెప్పారు.

  చిత్రంలో (ఎడమనుంచి కుడివైపు) శ్రీయుతులు వోలేటి పార్వతీశం, శ్రీనివాసులు రెడ్డి, ఆలపాటి బాపన్న, చెన్నూరి ఆంజనేయరెడ్డి, ఐ.ఏఎస్, S వాణీదేవి ఇంకా  కాండ్రేగుల నాగేశ్వరరావు


చిత్రంలో (ఎడమనుంచి కుడివైపు) శ్రీయుతులు వోలేటి పార్వతీశం, శ్రీనివాసులు రెడ్డి, ఆలపాటి బాపన్న, చెన్నూరి ఆంజనేయరెడ్డి, ఐ.ఏఎస్, S వాణీదేవి ఇంకా కాండ్రేగుల నాగేశ్వరరావు

రచయిత నాగేశ్వరరావు మాట్లాడుతూ ” లలిత కళలపై రెండు వ్యాసాలు మిసిమి సంపాదకులకిస్తే, వారికవి నచ్చి మిసిమికి క్రమంగా వ్రాయమని ప్రోత్సాహించారు. సాంస్కృతిక అధ్యయనం మన పాఠకులలో తక్కువగా ఉంది. మిసిమి లాంటి మంచి సాహిత్య పత్రికలు  ఆ లోటు తీరుస్తాయి. నేను అనంతపురం లో పనిచేస్తున్నప్పుడు వాణి (కీ.శే. పి.వి.నరసింహారావు కూతురు)  గారిని లేపాక్షి తీసుకెళ్ళి చూపించే బాధ్యత నా పై ఉంచారు.  లేపాక్షిలో వారి లైన్ డ్రాయింగ్స్  చూసాను. 17 సంవత్సరాల వయసు నుంచే పత్రికలకు వ్రాయటం ప్రారంభించాను. మా నాన్న గారు వైద్యులు. కాకతీయ రాజ్యపతనం కథాంశంగా  మల్లాది వసుంధర రచన  సప్తపర్ణి అనే చారిత్రక నవల ఈ పుస్తకానికి ఈ పేరుంచటానికి ప్రేరకం. మహర్షి ఇచ్చిన మొక్కకు స్వర్ణం రంగులో ఏడు ఆకులు వస్తాయి. అవే సప్తపర్ణి. కళలకు సంబంధించిన ఈ పుస్తకం లో, చలనచిత్రాలపై  నేను వ్రాసిన వ్యాసాలు కూడా ఉన్నాయి. సినిమాలు కదిలే చిత్రాలు. నిజమైన కళాత్మక చిత్రం సత్యజిత్ రే చిత్రం తోనే మొదలయ్యింది. సత్యజిత్ రే చిత్రకారుడు కూడా. బి.నర్సింగరావు, కె.వి.రెడ్డి ఇంకా బాపు దర్శకులు మాత్రమే కాక చిత్రకారులు కూడాను. ప్రపంచ విఖ్యాతుడైన దర్శకుడు Alfred Hitchcock చిత్రకారుడు కూడా. తన సినిమా కు కావల్సిన సెట్టింగ్స్ బొమ్మలు  అన్నీ తనే చిత్రించే వాడు. చిత్రకళకు సినిమాకు చాల దగ్గరి సంబంధం ఉంది. చిత్రాలకు న్యాయం జరిగేందుకై, సప్తపర్ణి ప్రమాణము 9″X9″ గా నిశ్చయించాను. సప్తపర్ణి మూడు భాగాలుగా తీసుకురావాలని ప్రణాళిక. మూడవ భాగంలో పరిశోధనాత్మక వ్యాసాలుంటాయి “ అని చెప్పారు.

సభాధ్యక్షుడు ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ “1920-26 ల లో అజంతా-ఎల్లొరా ల చిత్రాలకు సుమారు 250  నకళ్ళు గీయించారు. వీటిలో కొన్నింటిని నాగార్జున సాగర్ సంగ్రహాలయం లో ఉంచబోతున్నారు” అని తెలిపారు. సభ ఆద్యంతం ఆసక్తికరంగా, చక్కటి జ్ఞాన, భావ వీచికలతో, వోలేటి పార్వతీశం నిర్వహించారు.

Text and Photographs : సి.బి.రావు

Link for డాడాయిజం = http://en.wikipedia.org/wiki/Dada

 

 

 

 

మీ మాటలు

*