గోదారికి కొండమల్లెలు తురిమిన పాటగాడు!

నిన్నటి పాటతో ఇవాళ్టి కవిత: గిడుగుతో కవి కృష్ణుడు

నిన్నటి పాటతో ఇవాళ్టి కవిత: గిడుగుతో కవి కృష్ణుడు

“వేల మైళ్ల ఎత్తులో ఎగిరే పక్షినై.. “అని ఇటీవల ఒక కవిసమ్మేళనంలో ఒక కవి చదువుతున్నప్పడు అదే సమ్మేళనంలో నా ప్రక్కనే కూర్చున్న గిడుగు రాజేశ్వరరావు నవ్వుతూ..” పక్షి అంత ఎత్తుకు ఎగిరితే ఆక్సిజన్ లేక చచ్చిపోతుంది.” అని మెల్లగా నా చేయి నొక్కుతూ చమత్కరించారు. నాకూ నవ్వొచ్చింది కానీ ఇతరులు ఏమి అనుకుంటారో అని ఆపుకున్నాను.

ఆ తర్వాత నేనూ, ఆయనా కవితలు చదివాను. ఆయన నేటి వర్తమాన సమాజంంపై విసుర్లు విసురుతూ కందపద్యాలు చదివారు. చాలా సరళంగా, సులభంగా వచన కవిత్వం చదివినంత హాయిగా ఆయన కందపద్యాలు రాయగ లరు. మళ్లీ కలుసుకుందామని విడిపోయాం కానీ, ఆయన మూడునెలల్లోనే ఆయన నేను కలుసుకోలేనంత దూరం వెళిపోతారని ఊహించలేదు. 

ఎందుకో గిడుగును నేనుచాలా తక్కువ సార్లు కలిసినప్పటికీ కలిసినప్పుడల్లా మాకు ఎన్నో రోజులుగా పరిచయం ఉన్నట్లు అనుభూతి. నా చేతులను తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా చాలా విషయాలు మాట్లాడేవారు. నాకంటే ఆయన దాదాపు 30 ఏళ్లు పెద్దవారైనా ఆ వయోతారతమ్యం అనేదే లేనట్లు ఆయన సంభాషించేవారు. స్వాతంత్య్రం వచ్చిన రోజే ఆయన తొలికథ అచ్చయిందని తెలిసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అప్పటికి ఆయనకు 14 ఏళ్లు.

గిడుగుకు భౌతికమైన వయోతారతమ్యం మాత్రమే కాదు,మానసికమైన అడ్డుగోడలు కూడా లేవని, ఆయన స్వచ్చమైన నదీ ప్రవాహం లాంటి వారని ఆయనతో గడిపిన కొన్ని క్షణాలు అనిపిస్తుంది. ।మేధస్సును పెంచుకునే ఆరాటంలో మనసును పెంచుకోలేకపోవడమే నేటి మానవుడి బలహీనత… ఏ శిబిరానికో, వివాదానికో అంకితమై ఇతరుల్ని ప్రత్యర్థులుగా చూసే సాహసం అలవడ లేదు..* అని ఆయన ఒక సందర్భంలో చెప్పినప్పటికీ తన కథల్లో మానవ సంబంధాలను చిత్రించేటప్పుడు మనిషి మనిషిగా ఉండాలంటే కొన్ని జీవలక్షణాలు అవసరమన్న అభిప్రాయం ఆయనకు ఉన్నట్లు అర్థమవుతుంది. అది మంచితనం, యుక్తాయుక్త విచక్షణ,సభ్యత, మానవత్వం, సున్నితత్వం, ఒకరినొకరు గౌరవించుకోవడం, నైతిక విలువలు, బలహీనులకు చేయూతనివ్వడం లాంటివి. ఎలాంటి సిద్దాంతాల ప్రస్తావన లేకుండానే ఆయన కథల్లో మనం నిత్యం చూసే మనుషుల జీవితాల్లో ఈ విలువలను చిత్రించారు.
“ఏ ప్రేమ మహిమతో నెల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచి యుండు..” అన్నఅద్భుతమైన కవితా వాక్యంతో ఆయన ।కాళిందిలో వెన్నెల* అన్న కథ ముగించి మన రెప్పలు విశాలంగా తెరుచుకునేలా చేస్తారు. పురుషాధిపత్యాన్ని ద్వేషించే కాళింది అనే అమ్మాయిలో ఒక యువకుడు తెచ్చిన మార్పును ఈ కథ చిత్రిస్తుంది. “పతనమైన సామ్రాజ్య శకలాల్లోంచి నిజంగానే సరికొత్త విలువలు ఏరుకుంది లక్ష్మి..” అన్న వాక్యంతో ఆయన మరో కథ ముగుస్తుంది. ఆ కథ సాధారణ కుటుంబ కథ అయినప్పటికీ వ్యవస్థలో మార్పులు కుటుంబంలో ప్రతిఫలిస్తాయనే మౌలిక వాస్తవాన్ని ఆయన ముగింపు ద్వారా తెలిపారు.

ఇటీవల ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌ను సందర్శించేందుకు వెళ్లిన వేలాది మంది ప్రకృతివైపరీత్యాలకు గురైనప్పుడు ఆయన రాసిన ఒక కథ గుర్తుకు వచ్చింది. ।ఇంత చలిలో, అప్పుడప్పుడూ గోరువెచ్చగా వచ్చే ఎండలో ఉండీ ఉడిగిపడే వానజల్లులో ఈ మనుష్యులు ఇన్ని కష్టాలకోర్చి ఏం చూడాలని వెళుతున్నారు? వారిని ఇళ్లలోంచి తరిమి ఈ ప్రస్థానం చేయిస్తున్నదెవరు? సత్యశోధనా, జ్ఞానతృష్ణా ఈ యాత్రకు ఊపిరిపోస్తున్నదా? ఊహకందని విశాల విశ్వాకృతి పట్ల తనకున్న ఆరాధనా భావాన్ని ప్రకటించుకుని తేలికపడాలని మానవుడు ఒక సంక్షిప్తాకృతిని ప్రతీకగా కల్పించుకుంటున్నాడా? *అని ఆయన ఈ కథలో ఒక పాత్ర ద్వారా ప్రశ్నింపచేశారు. ప్రతిదాన్నీ వ్యతిరేక భావంతో, అనారోగ్య విమర్శనాత్మక ధోరణితో చూసేవారికీ గిడుగు దృష్టికీ ఎంత తేడా? అది మురికి కాల్వ ప్రవాహానికీ, జలపాతానికీ ఉన్న తేడా కాదా?

“రచ యిత ఏ ఇంట పుట్టినా, అతి అతడి చేతులో లేని పని. ఆ ఇంట తనకు వెచ్చగా కప్పిన కంబళిలో పెరిగినా, చింకి దుప్పటిలో పెరిగినా ఆ ఆచ్ఛాదన తొలగించుకుని లోకాన్నీ, సమాజాన్నీ, చరిత్రనూ ఆకళింపు చేసుకోగల విశిష్ట రచయితగా మారగలగాలి. కరకు కాబూలీ వాలాలో మెత్తటి మనసును చూడగలగడానికి టాగోర్ కాబూలీవాలాగా పుట్టాల్సిన అవసరం లేదు..” అని గిడుగు రాజేశ్వరరావు అన్నారంటే ఆయన పిడివాదాలకూ, అస్తిత్వ వాదాలకూ, సిద్దాంత,రాద్దాంతాలకూ ఎంతో దూరంగా ఒక నిర్వికల్ప,నిష్కల్మష స్మితయోగిగా ఎదిగారని అర్థమవుతుంది. లేని వాళ్ల బతుకు గడవని క్షణాలను, ఉన్న వాళ్ల బతకడం రాని దినాలను ఆయన సమానంగాచిత్రించారు.

నిజానికి ఆయనలో గాఢత లేదని కాదు. గాఢత ఉన్నందుకే ఆయన సరళంగా వ్యక్తం చేయగలిగారు. తండ్రి గిడుగురామమూర్తి పంతులు,పెదతండ్రి గిడుగు సీతాపతి,తండ్రిగిడుగు రామదాసు తెలుగు భాషను గ్రాంథిక కౌగిలినుంచి వేరు చేసేందుకు చేసిన కృషి అంతా గిడుగు రచనల్లోనే ప్రతిఫలిస్తుందేమోననిపిస్తుంది. ఆసక్తికరమైన విషయమేమంటే గిడుగు కుటుంబం జీవితం రాష్ట్ర విభజన తో ముడిపడి ఉన్నది. ఒరిస్సా రాష్ట్రం అయినప్పుడు పర్లాకిమిడి రాజా అందులోనే ఉండాలని నిర్ణయించారు. రాజాను వ్యతిరేకించిన సీతాపతి తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు.ఒరిస్సా రాష్ట్రం అయిన రోజే గిడుగు రామమూర్తి కుటుంబం విజయనగరం తరలివచ్చింది. పర్లాకిమిడిలోని టెక్కలిలో హైస్కూలు వరకు చదివిన రాజేశ్వరరావు విజయనగరంలో ఇంటర్ చేశారు. శ్రీశ్రీకి పాశ్చాత్య సాహిత్యాన్నిపరిచయం చేసిన రోణంకి అప్పలస్వామి శిష్యరికం ఆయనకు అబ్బిందంటే రాజేశ్వరరావు ఎలాంటి పరిణతి సాధించాలో అర్థంచేసుకోవచ్చు. 1956 వరకూ మద్రాస్ ఎజి ఆఫీసులో పనిచేసిన రాజేశ్వరరావు రాష్ట్ర విభజన కాగానే ఉద్యోగుల బదిలీలో భాగంగా హైదరాబాద్ ఎజి ఆఫీసుకు వచ్చారు. ఇప్పుడు మరోసారి రాష్ట్ర విభజనకు తెరతీస్తున్న సమయంలోనే ఆయన మరణించడం యాదృచ్ఛికం కావచ్చు. మద్రాసులో ఉద్యోగం లేనప్పుడు ఆయన అప్పుడు మద్రాసులో ఉన్న గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ప్రతులకు మేలు ప్రతులు రాస్తూ చిరుద్యోగంచేసేవారట.

గిడుగు రాజేశ్వరరావు తనను తాను ఎప్పుడూ మేధావి అని, ఎవరికో ఏదో బోధించాలనో ఎప్పుడూ అనుకోలేదు. వెన్నెల ఆకాశానికీ, మేఘాలకూ మాత్రమే పరిమితంకాకుండా నేలపై, పసిపాపలచెక్కిళ్లపై, ప్రేమికుల కనురెప్పలపై, పేదల ఆశలపై మెరిసినట్లు ఆయన కథలు, కవితలు, గేయాలూ రాస్తూ జీవించారు. స్కూలుకు వెళ్లే తన కూతురు అడిగినా, పోరాటాలు చేసే కార్మికులు అడిగినా ఆయన వారివారి భావాలకు తగ్గట్లు ర చనలు రాసిస్తూ ఉండిపోయారు. రేడియోకోస లలిత గీతాలు, నాటికలు రాశారు. ఎజి ఆఫీసులో రంజని సాహిత్య సంస్థకు సారథ్యం అందించి బృహత్తర కార్యక్రమాల్ని నిర్వహించారు. ఆకురాల్చి నిట్టూర్చిన తరువులు, కోరిన రంగుల కొత్త చివురులు, కురిసే జల్లుల పుడమి కమ్మగా కలుకుచు తావిని చిమ్మేకాలాలను అలవోకగా చిత్రిస్తూ పోయారు.

“విరితేనెల గ్రోలి భ్రమర వైణికులే మురియగా, విరబూసిన వేపరెమ్మ వింత తావి కురియగా* అని రాయడం ఆయనకు అలవోకగా అబ్బింది. అదే సమయంలో ఆయనలో ప్రేమికుడు దాగిపోలేదు. ।ఆ కాటుక కళ్లలోని అల్లరి ఇంతింతా? అవిరేపే పెనుతుఫాను ఎదలో ఎంతెంతా? ” అని తనను తాను ప్రశ్నించుకున్నారు.

“ఒడ్డునెక్కి నవ్వుతున్న ఓరకనుల చినదానా, ఉరికిపడే వరదనీటి ఊపేమిటి తెలుసునా? ” అని తన ఊపు గ్రహించమని సంకేతాలందించారు. “మెల్లగ పోనీర బండి అల్లరి పిల్లోడ, కొండగాలి ఎదరగొట్టి గుండె ఝల్లుమంటది, మనసులోని ఊసేదో మాటకందనంటది, మాటరాక పల్లకుంటే ఏటోలా గుంటది.. “అని పిల్లదాని మనసును చిత్రించిన రసహృదయుడు రాజేశ్వరరావు. ఆయన పిల్లలకోసం రాసిన గేయాలు కూడా అసమానం. “ఎప్పటికప్పుడు ఏదో పనిలో తీరిక చిక్కని పెద్దల్లారా, చిట్టెడు ప్రేమనుపంచండి.. ” అని రాశారు. ఆయన కవితలు, గేయాలు చదివితే మన జీవితాలను చుట్టుముట్టిన పట్టణీకరణ కాలుష్యం తొలగిపోతుందనడంలో అతిశయోక్తి లేదు.

ఆయన సంగీత ప్రియుడని కూడాచాలామందికితెలియదు. కాని ఆయన గేయ సంపుటాలకు రావు బాలసరస్వతి, శ్రీరంగం గోపాలరత్నం లాంటివారు ముందుమాటలు రాశారు. అల నాటి ప్రముఖ గాయని, నటి బాలసరస్వతి ఆయన సంగీత జ్ఞానానికి పరవశించిపోయారు. 1936లో ఆమె ఆరేళ్ల ప్రాయంలో బాల కుచేల నాటకంలో నటించి పాడిన పాట కూడా రాజేశ్వరరావుకు నోటికి వచ్చని ఆమే రాశారు.

“శిశిర రుతువులో కూడా చిత్రమైన అందాన్ని చూడగల భావుకుడూ, తాత్వికుడూ రాజేశ్వరరావు” అని, “ఆయన పాటలలో గోదారి సరికొత్త అందాలు సంతరించుకుని కొండమల్లెలు తురుముకుంటూ ఉరుకుతుందని,నిరాశగా ఉన్న ఎలమావి ఉన్నట్లుండి వన్నెలు తొలగి పలకరిస్తుందని” బాలసరస్వతి రాశారంటే రాజేశ్వరరావు గొప్పతనం మనకు అవగతమవుతుంది.

మల్లీశ్వరి, మాయాబజార్, చెంచులక్ష్మి వంటి గొప్ప చిత్రాలకు సంగీత దర్శకత్వంవహించిన ప్రముఖ సంగీత విద్వాంసుడు సాలూరురాజేశ్వరరావు నుఆయనఎంతో అభిమానించేవారు. ।గాలినై వేణువున క్షణమున్న చాలురా, రాగఝరినై సాగి పొంగిపోతాను* అని రాసిన గిడుగు రాజేశ్వరరావు సాలూరి పాడిన ।ఓహో యాత్రికుడా* పాటను మరిపిస్తూ యాత్రికుడులా సాగిపోయారు.

కృష్ణుడు

మీ మాటలు

*