అంతా భీకర యుద్ధాల సారాంశమే కదా..!

rajayya-150x150

నాన్నా వంశీ,

బాగున్నావా? నేను అమెరికా వచ్చి అప్పుడే నెల కావస్తోంది. సమస్త దైనందిన వ్యవహారిక ముసుగులన్ని వొదిలిపెట్టి జీరో దగ్గర మొదలుపెట్టినట్టుగా ఉంది. అప్పుడెప్పుడో అల్లకల్లోలంగా తిరుగుతున్నప్పుడూ రష్యా కుప్ప కూలిందని,  చైనా దిక్కు మారిందని, అదేదో మన స్వంత వ్యవహారమన్నంత దిగులుగా తిరుగుతున్నప్పుడు, ఇంద్రగంటి కిరణ్మయి సీపెల్‌లో ఒక బెంగాలీ సినిమా చూయించారు. అది రికరింగు  ఫ్రమ్ జీరో.. నక్సల్బరీ ఉద్యమంలొ జాదవపూర్ యూనివర్సిటీ విద్యార్థి ఉద్రిక్త, ఉద్విగ్న రాజకీయాలలో తిరుగుతూ అరెస్టయి.. పదేండ్ల తరువాత విడుదలై, కలకత్తాలో, తనకు రాజకీయాలు నేర్పిన ఉపాధ్యాయుడి ఇంట్లో మళ్లీ జీవించడం ఆరంభించడం, మళ్లీ పనిలోకి, ప్రజల్లోకి, సూర్యరశ్మిలోకి వెళ్లడం ఆ సినిమా…

నాకు ఈలాంటి విచిత్ర భారీ జీవితంలో అంతఃచేతనంలో ఉన్న అనేక విషయాలు పోటెత్తుతున్నాయి. గుడిమెట్టు కింది చిన్న పల్లెటూరు, గుట్ట మీది నుండి పారుతూ వచ్చిన బూరుగు వాగు – గుడిసెలు – పశువులు, పక్షులు , పంటలు… ప్రతి చిన్న విషయము పోటెత్తుతున్నాయి. మొన్న మే 19నాడు ఇక్కడ సముద్ర తీర ప్రాంత సాహిత్యాభిమానులు ‘వీక్షణం’ అనే సమావేశానికి గొల్లపూడి మారుతీరావుగారితో పాటు నన్ను పిలిచారు.

ఎన్నో రకాల అద్భుత అతీంద్ర శక్తులు, చదువులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్లు వీళ్లు. సముద్రాలు దాటి, దేశాలు దాటి, నిత్యము నిరంతరం అప్రమత్తతతో వేగవంతమైన జీవితం జీవిస్తున్నవాళ్లు వీళ్లు. వీళ్ల మధ్యలో ఎక్కడో మారుమూల  పల్లెటూల్లో పుట్టిన నేను, బెరుకుగా వెళ్లాను. నా నలభై యేళ్ల దండ్లాట, వెతుకులాట, మనుషులకోసం పరితపించడం, అమానవీయ ప్రపంచంలో తలపడటం గురించి అస్తుబిస్తుగా మాట్లాడాను. వాళ్లకేమర్ధమయ్యిందో తెలియదు. నిత్యమూ  నిరతరం అస్థిర అస్తవ్యస్త సంక్షోభం. జీవితం గడిపే రైతాంగం, ప్రపంచీకరణ మాయలో,  ఉప్పెనలో కొట్టుకపోతున్న, పట్టుకోల్పోతున్న కోరు పారిశ్రామిక కార్మికులు. ప్రకృతివనరులు, నీరు , నేల, ఖనిజాలు తవ్వుకపోతూ, నిలువ నీడలేక అనివార్యంగా యుద్ధరంగంలో నిలబడ్డ మన దేశ ఆదివాసులు, వీళ్లందరి గురించి ప్రపంచానికి ఆ లోలోపల తడిని చెప్పడానికి ఆ తడిని, ఆర్తిని, వీరోచిత తిరుగుబాటును చెప్పడానికి నాకు భాష సరిపోలేదు. అయినా ఇంత పకడ్బందీగా ప్రోగ్రాం చేయబడిన దేశంలో కూడా మనుషులకు లోలోపల దారితెన్నూ కానని తడి ఉన్నది. ఈ మహేంద్ర జాలంలో కూడ వీళ్లందరు నిత్యము, నిరంతరం మనిషి కోసం వెతుకుతున్నట్టుగా అనిపించింది.

గొల్లపూడి మారుతీరావుగారు – జీవితంలోని వెలుగునీడల మర్మమెరిగినవారు.వారు గత కొంత కాలంగా హెచ్ ఎమ్. టీవీ వాళ్ల కోసం వందేళ్ళ తెలుగు కథ చేస్తున్నారు. తెలుగు కథ పరిణామం గురించి బాగా మాట్లాడారు. తెలుగు నాటకం గురించి … ఒక జాతి ఆత్మను, గుండెకాయను కాపాడుకోవాల్సిన ప్రజల ప్రభుత్వాల బాధ్యత గురించి ప్రశ్నించారు.   ప్రపంచ సాహిత్యంలోని మనిషి కోసం వెతికే కథల గురించి అద్భుతమైన కంఠస్వరంలో విన్పించారు. చెహోవ్ నిద్ర లేని పిల్ల కథ. తను సాకుతున్న పిల్లవాడి గొంతు నొక్కడం. మనసు వికలమయ్యింది. ఈ కథ 1980లో ఒక సమావేశంలో రావిశాస్త్రిగారు చెప్పారు. అప్పటినుండి ఆ కథ నన్ను వెంటాడుతూనే ఉన్నది. కవితలు, ముచ్చెట్లు, అక్కడికి వచ్చినవాళ్లంతా తమలోలోపలికి.. సమావేశకర్త కె.గీతగారు మా మిత్రురాలు ప్రముఖ రచయిత్రి కె.వరలక్ష్మిగారి కూతురు. కథకురాలు. కవయిత్రి.. ఒక చిన్న సూర్యకిరణాన్ని తన చేతులతో ఇక్కడ విత్తుతున్నారు.

ఎక్కడినుండో మరెక్కడికో వచ్చాను. చాలామంది గురించి రాయాలి. చురుకైన నిజామాబాదు అబ్బాయి గురించి. సి.నారాయణరెడ్డిగారి బంధువు అబ్బాయి. తను ఏదో చేయాలనే తపనతో బుచ్చిబాబన్నట్లు మండుతున్న కాగడాల్లాగే తిరిగే ఈ మనుషుల గురించి శక్తి చాలదు. తెలిసింది కొద్దిగా.. ముఖ్యంగా కుమారపల్లి హన్మకొండ సోమయ్యగారి గురించి..

ఒక ఆదివారం స్ఫూర్తి, చందూ, శ్రీధర్ కలిసి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్ళాం. ఏడో  వింతలో ఒకటైన గోల్డెన్ బ్రిడ్జ్ అదివరకే చూశాను. ఈ భయంకర బంగారు నగరం గురించి లోలోపల అధో జగత్ సహోదరులు  పడే యాతన  గురించి, నేను ఒక చైనా నవల చదివాను. శుభ్రమైన, ఎత్తైన, మహాద్భుతమైన, దృఢమైన మహా సాధనాలు చూస్తుంటే.. నాలోలోపల తగలబడిపోయిన బాగ్దాదు నగరం, ఆరని కుంపటి ఆఫ్ఘనిస్తాన్, నిత్యము, నిరంతరం యుద్ధరంగంగా అతలాకుతల మవుతున్న ప్రపంచం. బస్తర్ దండకారణ్యం మానవులు తమ శ్రమతో నిర్మించుకున్న సమస్త నాగరికత తుడిచి పెట్టుకుపోయి, వ్యాపార విధ్వంసం. లోలోపల కదిలింది. వీధుల్లో ఆ దేశాల  నమూనాల్లాగా అనాధలు, ఇల్లు  లేని విధం కడుపులో దేవినట్లయింది…

110621-Civil_War_art-AP248502718257_620x350

ఆసియా మ్యూజియంకు వెళ్లాం. అబ్బో… చైనా, వియత్నాం, కొరియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియాలాంటి దేశాల  అపురూపమైన, విలువైన రాతి, లోహ యుగ నమూనాల నుండి ఇప్పటి పెయింటింగ్స్ దాకా.. ఒక అపురూపమైన యుద్ధ,బీభత్స, మహా పరిణామ క్రమం కళ్లముందు మెదిలింది. ఎక్కువగా చైనీయులు కన్పించారు. భౌద్ధానికి సంబంధించి వివిధ కాలాలకు సంబంధించిన దేవతలు, పురాతన శిల్పాలు, వస్త్రాలు, కర్ర శిల్పాలు వందలు, వేలున్నాయి. అప్పటినుండి ఇప్పటిదాకా మానవుని అన్వేషణ, వెతుకులాట.. చరిత్ర సమస్తం భీకర యుద్ధాల సారాంశమే కదా.. అయితే చైనా విప్లవానికి సంబంధించినవేవీ లేకపోవడం ఈ మ్యూజియం విశేషం. అరువై యేళ్లకు నేనిక్కడ తిరుగుతున్నా స్ఫూర్తి తను పుట్టిన దగ్గరినుండే తిరుగుతోంది. తిరిగి తిరిగి ఇల్లు చేరుకున్నాము.

నేనిప్పుడున్నది కాలిఫోర్నియాలోని  సన్నివేలు. ఇక్కడ గూగుల్, యాహూ లాంటి అనేక సాఫ్టువేరు కంపెనీలున్నాయి … తమిళ, తెలుగు, గుజరాతీ, పంజాబీ వాళ్లు ఎక్కువగా కన్పిస్తున్నారు. ఇందులో కూడా తెలంగాణా వాళ్లు తక్కువే. మొత్తంగా ఇంత దూరం ఇన్ని రకాల సాహసాలు చేసి రాగలగడం కింది కులాలకు సాధ్యం కాదు.

మెదడు, చేతులు ఖాళీ.. గోనెడు జొన్నలు చాలని చేను దగ్గర మూడు నెలలు రికామిగా కావలి కాసే ఆదివాసి గోండు దాదా లాగా ఉన్నది మానసిక స్థితి.

ఉరుకులు పరుగులు.. పోటీ.. ఒత్తిడి కత్తి అంచుమీద అతి చాకచక్యంగా, నైపుణ్యంగా బతికే ప్రపంచంలోని అత్యంత ఆధునికమైన, అధికారికమైన,.. అందులో బే ఏరియాలో… సుడిగాలిలా ప్రపంచవ్యాపితంగా వ్యాపించి అల్లకల్లోలం చేస్తున్న గ్లోబలైజేషన్ మార్కెటు ఉన్మత్త అంతరంగంలో ఇదిగో ఇట్లా నేను ఖాళీగా.. భిన్నంగా…

ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడల్లా.. నేను  1993 వేసవికాలంలో అహోబిలం కొండమీద చూసిన మొలకు చిన్న తుండు గుడ్డ, చేతిలో చిన్న కట్టె.. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అదిలాబాదు కొలిమిలో తయారుచేసిన ఉక్కు చాకులాంటి శరీరం. నేరేడు రంగు, విచిత్రమైన, లొంగని కళ్ళు కల ఆ పిల్లవాడు గుర్తొస్తాడు. అతను మాకు కొండ మీదికి దారి చూపిన గైడు. అతనికి యిస్తామన్న అయిదు రూపాయలు. మార్గమధ్యంలో అతను మెరుపు వేగంతో పట్టుకున్న ఉడుము.. నేనతనికి పదిరూపాయలిస్తే తీసుకోలేదు. అయిదే కావాలన్నాడు. అతను దేనికీ లొంగకుండా.. బహుశా నా విషాద, వైఫల్యాలలో నాకిప్పటికీ అతను గైడే.

బహుశా  ఈ భూగోళాన్ని ఫుట్‌బాల్‌లా ఆడగల ధీరుడతను.. ఏ ప్రోగ్రాములకు అందనంత ఎత్తైనవాడు. ఏ వస్తువుకు, ఆస్తికి లొంగనంత ధీరోదాత్తుడతను. ఈ ప్రపంచం మన కలల ప్రపంచం. సకల విధ్వంసాల నుండి కాపాడుదాం..

మేం భూస్వామిక ఊపిరి సలుపని ప్రపంచం నుండి వచ్చిన వాళ్లం. ఆ అమానవీయ పరిస్థితులలో తలపడి పెనుగులాడి  మార్చడానికి తాపత్రయపడ్డవాళ్లం. ఈ క్రమంలో మన ప్రాంతంలో నా సహచరులు ఈ మాట రాస్తున్నప్పుడు నా కళ్లు నీళ్లతో నిండిపోయి అక్షరాలు అలుక్కుపోతున్నాయి. సహచరులు, కొడుకులు, కూతుళ్లు ఆహుతయ్యారు. అయినా కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి కలలు కంటున్నారు. మళ్లీ ఇరువై సంవత్సరాల తరువాత ప్రపంచీకరణ  నేపధ్యంలో ప్రగాఢమైన విషాదకరమైన అయినా వీరోచితమైన మా సామూహిక అనుభవాన్ని నాన్నా వంశీ!  నీతో పంచుకుంటున్నాను . అంటే ఈ లేఖ నీవొక్కనికే కాదు. రాసేది నీ పెదనాన్న మాత్రమే కాదు. తండ్రులు కొడుకులతో మాట్లాడే మాట యిది.

బహుశా కరెంటు వైర్ల మధ్య, తుమ్మ ముళ్ల మధ్య రాత్రి పగలు వొంటరిగా నిరంతరం శ్రమ పడుతూ కూడా కూనిరాగం తీస్తూ, అద్భుతమైన పాటలు, కథలు రాసిన మీ నాన్న, పెట్టుబడి  యంత్రాంగం, వేగవంతమైన జీవితంలో మన వూళ్ల గురించి పలవరించే ముళ్ళ దారిలో కాక..

నా కాలం పోయింది . మీ కాలంతో మీతో పంచుకోవడం..

ఇట్లు ..

పెదనాన్న..

మీ మాటలు

  1. రాజయ్య గారూ-
    అమ్మని మీరు తల్చుకుని నాకూ గుర్తు చేసారు. సమావేశం లో మీ మాటలతో కలిగించిన స్ఫూర్తికి కృతజ్ఞతలెలా చెప్పను?

మీ మాటలు

*