దైవాన్ని కొలవడానికి దేహాన్ని శిక్షించాలా?

sathyavati“ప్రతి కాథలిక్ బాలకలోనూ చిన్నప్పుడు తనొక సన్యాసిని(నన్) కావాలనే కోరిక వుంటుంది. యౌవనం వచ్చేవరకూ ఆకోరిక ఆమెలో నిలిచేవుంటుంది.నాకూ అలాగే వుండేది.నేను ఒంటరిగా చర్చ్ కు వెళ్ళినప్పుడంతా “నేనూ ఒకప్పుడు నన్ అవుతాను” అనుకునేదాన్ని.కానీ నాకు ప్రభువునుంచీ పిలుపు రాలేదు. యౌవ్వనం నాలో ఒక తుఫాను రేపింది. నాశరీరపు కోరికలను నేను తలుపు వెనక్కి నెట్టలేదు.అందుకు విరుద్ధంగా నా పరువాన్ని ఆస్వాదించాలనుకున్నాను …జీవితం దాని దారిన అది సాగింది నాకు పదహారేళ్ళకే వివాహం అయింది..” అంటుంది సారాజోసెఫ్  ఆమె వ్రాసిన  “ఒథప్పు”అనే నవల ముందుమాటలో.వివాహం అయినా ఆమె క్రీస్తు గురించి ఆలోచిస్తూనే వుంది..ఆర్థిక ,సామాజిక,జెండర్ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటూ ,వ్యవస్థీకృతమైన మతానికి భిన్నంగా ఒక కొత్త ఆధ్యాత్మికత గురించిన అన్వేషణే  “ఒథప్పు” నవల. మత రాజకీయాలను తీవ్రమైన విమర్శకు పెట్టిన నవల.స్త్రీల ఆధ్యాత్మికతకు కొత్త నిర్వచనాన్ని సూచించిన నవల కూడా.

“మనశ్శరీరాలు మమేకమైనప్పుడు స్వతస్సిద్ధంగా పొంగి వచ్చే సంగీత ఝరి వంటి ప్రేమ, స్త్రీలకు ఆనందాన్నిస్తుందే తప్ప, కేవల శారీరవాంఛా పరిపూర్తి  కాదు. వాళ్లకు లైంగికత అనేది కేవలం భౌతికపరమైన  విషయంకాదు. స్త్రీల విషయంలో వాళ్ల ఆధ్యాత్మికనూ లైంగికతనూ విడదీసి చూడకూడదు.బ్రహ్మచర్యం లేదా కన్యాత్వం అనేది ప్రకృతి తోనూ శరీరంతోనూ చేసే యుద్ధంలాంటిది. చర్చిలలోనూ మఠాలలోనూ అనేక పవిత్ర వస్త్రాలు కప్పుకుని చాలామంది  తమ శరీరాలతో పోరాడుతూ ఊపిరాడకుండా సతమతమౌతూ వుంటారు.ఆ పవిత్ర స్థలాలలో అత్యాచారాలూ ఆత్మహత్యలూ హత్యలూ కూడా జరుగుతూవుంటాయి….. ఒక స్త్రీ ఆధ్యాత్మికత ఆమె తన పురుషుడితో పంచుకునే ప్రేమ పూరిత శృగారంలోనూ  ,ప్రసవ వేదనలోనూ వుంటుంది,”  అంటుంది  ప్రముఖ మళయాళ స్త్రీవాద రచయిత్రి , ఉద్యమ కార్యకర్త కూడా అయిన సారా జోసెఫ్.

ఆడపిల్లలకు శరీర జ్ఞానంలేకుండా పెంచుతారు.అద్దంలో తమ నగ్న శరీరాన్ని చూసుకోడం కూడా ఒక తప్పుగా సిగ్గులేని చర్యగా భావించేలా నియంత్రిస్తారు.ఇంక సన్యాసినులు (నన్స్) అనేక పొరల బట్టల కింద తమశరీరాన్ని కప్పిపెట్టి ,దాన్ని అభావం చేసుకుంటారు.తమ శరీరాలకు తాము పరాయివాళ్ళైపోతారు.

గొప్ప సేవాభావంతో క్రీస్తు పట్ల ఆరాధనతో కాన్వెంట్ కు వెళ్ళి, కొన్నాళ్లకి అక్కడ ఇమడలేక బయటికివచ్చి, అనేక కష్టాలకూ అవమానాలకూ అపనిందలకూ గురై తన అంతరాత్మను తప్ప మరి దేనినీ లక్ష్యపెట్టక  జీవితాన్ని ఎదుర్కున్న ఒక మేరునగధీర కథ  ఈ నవల. “ఒథప్పు” అనే పదానికి చాలా అర్థాలున్నాయట. “అపవాదు” అనీ,  ” దారి మళ్ళించడం”  అనీ  “కళంకం” అని….ఈ నవలను ఆంగ్లంలో అనువాదం చేసి, ఉత్తమ అనువాదానికి క్రాస్ వర్డ్ బహుమతి అందుకున్న వాల్సన్ థంపు దీనికి ఆంగ్లంలో “ ది సెంట్ ఆఫ్ ది అదర్ సైడ్” అని పేరు పెట్టాడు.

సన్యాసిని కావాలనే కోర్కె కలగడాన్ని “ప్రభువు పిలుపు”గా భావిస్తారు క్యాథలిక్కులు. తమ ఇంట్లో ఒక ఆడపిల్ల అట్లా ప్రభువు సేవకు జీవితాన్ని అంకితం చెయ్యడాన్ని ఒక ఖ్యాతిగానూ , అక్కడనించీ తిరిగిరావడాన్ని అపఖ్యాతిగానూ భావిస్తుంది ఆ కుటుంబం.  సమాజమూ,చర్చీ కూడా అట్లాగే భావిస్తాయి .నచ్చని చదువు మానవచ్చు,నచ్చని ఉద్యోగం మానవచ్చు,నచ్చని భార్యకో భర్తకో విడాకులిచ్చి రావచ్చు కానీ ఒక సారి సన్యాసం పుచ్చుకున్నాక సామాన్య జనుల్లోకి రావడాన్ని దారితప్పడంకిందా ,అది కుటుంబానికీ, ఆమె జీవితానికీ తెచ్చుకున్న ఒక మచ్చక్రిందా పరిగణిస్తారు. ఎవరూ అక్కున చేర్చుకోరు.

సంఘమూ మతమూ కొందరికి అంటగట్టే అలివిమాలిన త్యాగాలలో సన్యాసం కూడా ఒకటి. కొంతమంది ఆడపిల్లల్ని పెంచిపెద్ద చేసి,  పెళ్ళిళ్ళు చెయ్యలేక కూడా కాన్వెంట్ కి పంపిస్తారు. వాళ్ల వలన కుటుంబానికి కొంత ఆర్థికంగా సహాయం అందుతుంది . వీళ్ళు ఇష్టమైనా కష్టమైనా అక్కడ బందీలే! ఈ నవలలొ ఆబులమ్మ ,ఆమె చెల్లెళ్ళ పరిస్థితి అదే!!

ఈ నవలలో ముఖ్యపాత్ర మార్గలిత సంపన్నుడైన చెన్నెరె వర్కె మాస్టర్ గారాబు బిడ్డ. ఇద్దరు మగపిల్లల తరువాత పుట్టిన ఆడపిల్ల. ఆమె నన్ గా మారతానంటే, మానవసేవచెయ్యడానికి సన్యాసమే పుచ్చుకోనక్కర్లేదనీ ఇంట్లోవుండికూడా చెయ్యొచ్చనీ  నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నిస్తాడు తండ్రి. కానీ ఆమె పట్టు విడవదు. తల్లికి తన కూతురు నన్ అయిందంటే చాలా సంతోషం. అంత పట్టుదలతో విశ్వాసంతో కాన్వెంట్ కి వెళ్ళిన మార్గలిత అక్కడ ఎక్కువ కాలం వుండలేకపోతుంది.అక్కడి ద్వంద్వ విలువలు,నిర్బంధాలూ,వేధింపులూ ఆమెకు నచ్చవు. ఎంతో సంఘర్షణ పడి చివరికి కాన్వెంట్ వదిలి, వర్షంలో తడిసి  ముద్దై ఇంటికి వస్తుంది.

అప్పటికి ఆమె తండ్రి చనిపోయాడు.నిరంకుశుడైన పెద్దన్న జాన్  ఇంటిపెత్తనం తీసుకున్నాడు. సన్యాసిని వస్త్రాలలో కాకుండా .చీరె కట్టుకుని వచ్చిన కూతుర్ని చూసి తల్లి స్పృహతప్పి పడిపోతుంది.ఎవరో ఆమె వీపుమీద బలంగా తన్ని చీకటిగదిలో పడేసి తలుపులు మూశారు. (అది  త్వరగా పండడం కోసం అరటి కాయలు మగ్గేసే గది) .మూడు రోజులపాటు ఆకలితో దాహంతో కాలకృత్యాలు తీర్చుకునే వీలుకూడా లేకుండా ఆ చీకటిలో చెమటలో పడివుంది మార్గలిత. ఇంటికి మచ్చతెచ్చిన పిల్ల. వివేకవంతుడూ ప్రేమ మూర్తీ అయిన ఆమె తండ్రి బ్రతికి వుంటే అట్లా జరిగివుండేది కాదేమో!

మార్గలితకి కాన్వెంట్ లో వున్నప్పుడే రాయ్ ఫ్రాన్సిస్ కరిక్కన్ అనే అసిస్టెంట్ వికార్ తో పరిచయం అతను  పాటలు నేర్పడానికి కాన్వెంట్ కి వచ్చేవాడు..అతనికి కూడా తన పై స్థాయి ఫాదర్ డేనియల్ పద్ధతులు నచ్చవు.ఫాదర్ డేనియల్ శుద్ధ ఛాందసుడు. శాంతి గురించీ, సేవ గురించీ ప్రేమ గురించీ బోధించడం కాదు, ఆచరించాలంటాడు కరిక్కన్ .అతనివీ ఫాదర్ డెనియల్ వీ పొసగని అభిప్రాయాలు.కానీ తన అధికారంతో కరిక్కన్ నోరు మూయిస్తూ వుంటాడు ఫాదర్ డేనియల్.

కాన్వెంట్ జీవితంపైతన మనసులో  కలిగే భావాలన్నీ ఎప్పటికప్పుడు కరిక్కన్ కు ఉత్తరాలు వ్రాస్తూ వుంటుంది మార్గలిత.ఆమె అభిప్రాయాలకు అచ్చెరపడుతూ ఒకటికి రెండు సార్లు చదువుకుని వాటిని దాచుకుంటూ వుంటాడు కరిక్కన్. అతను కడుపేద కుటుంబం నుంచి వచ్చిన వాడు. అతని తండ్రి పచారీ కొట్టుకి మూటలుమోసే కూలీ. తను కాన్వెంట్ వదిలిపోతున్నాననీ తనకు వెంటనే ఒక జత బట్టలూ కొంతడబ్బూ అందజెయ్యమనీ ఉత్తరం వ్రాసింది మార్గలిత. ఆ బట్టలు కొనడానికి అతను చాలాసందేహించాడు. ” ఒక ఫాదర్  చీరె కొంటే చూసేవాళ్ళేమనుకుంటారు?” అనుకుంటాడు, భయంభయంగా కొని ,దాన్ని చాలా సౌకర్యంగా అక్కడే మర్చిపోయివస్తాడు.

మూడు రోజుల చీకటి గది లో జ్వరంతో వుండి ఆమె మేనత్తకూతురు రెబెక్కా దయతో బయటపడ్డ మార్గలితకు ఆ ఇంట్లో ఎవరూ మందూ మాకూ చూడరు.ఆమె కాన్వెంట్ నుంచీ వచ్చేసిందని డాక్టర్ కి కూడా తెలియకూడదు.ఆమె పెద్దన్న జాన్,నగర మేయర్ కావడానికని చాలా కష్టపడి ప్రచారం చేసుకుంటున్నాడు.ఈ మచ్చ అతని ఎన్నికలమీద పడుతుంది.

ఆమె ఆ యింట్లో తిండీ నీళ్ళూ మందూ లేకుండా కృశించి చనిపోయినా వాళ్లకేం బాధలేదని అర్థం చేసుకుని అక్కడనుంచీ బయటపడి  తిరిగి తిరిగి చివరికి కరిక్కన్ దగ్గరికి చేరింది .కానీ కరిక్కన్ మార్గలిత అంత ధైర్యవంతుడుకాదు.అతనికి చర్చి  భయం, సమాజం భయం, దైవభీతి, కుటుంబం భయం, ఇట్లా చాలా  భయాలున్నాయి.ఆమెకు యొహానన్ కస్సీస్సా అనే సిరియన్ క్రిష్టియన్ ఫాదర్ ఇంట్లో ఆశ్రయం ఇప్పిస్తాడు. ఆమెపట్ల తనకున్న ఆకర్షణని సానుభూతినీ బయటపడనివ్వడు కస్సీస్సా . అతని భార్య సారా కోచమ్మా అతని తల్లి అన్నమ్మకుట్టీ మార్గలితను ఆదరిస్తారు.

ఆమె ఎన్నాళ్లని అక్కడుండాలి?ఆమెకో జీవనాధారం కావాలికదా?అందుకోసం ఆమె తండ్రి స్థాపించిన స్కూల్లో ఉపాధ్యాయురాలిగా చేర్చుకోమని జాన్ ని అడుగుతాడు కస్సీస్సా. మార్గలితతో తమకేం సంబంధం లేదనీ తమ ఇంటివ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మర్యాదగా వుండదనీ అతన్ని అవమానిస్తాడు జాన్. తండ్రి ఆస్తిలో తన వాటాకోసం కోర్టుకు వెళ్ళమంటాడు కస్సీస్సా. ఈలోగా ఊళ్ళో కొందరు కస్సీస్సా ఇంటిమీదకొచ్చి అతనికీ మార్గలితకూ సంబంధాలు అంటగడుతూ దుర్భాషలాడి గలాటా చేస్తారు. మార్గలిత ఎటువంటిదో ,తన భర్త ఎటువంటివాడో తెలిసినా అతనికి చెడ్దపేరురావడం సహంచలేని కస్సీస్సా భార్య ఆమెను ఇంటినుంచీ పంపెయ్యమంటుంది. అప్పడుకూడా కరిక్కన్ ఆమెకు సహాయం రాడు.

ఎవరూ పంపించనవసరం లేకుండా తనే ఆయింటినుంచీ బయటపడి రెబెక్కా సాయంతో ఫాదర్ ఆగస్టీన్ దగ్గరకు వెడుతుంది. ఫాదర్ ఆగస్టీన్ ఏ చర్చి అధికారానికీ తలవొంచని స్వతంత్రుడు,నిరాడంబరుడు, ఆచరణ శీలి. అడవిలో వుంటూ. దొరికింది తింటూ అక్కడుండే పేదలకు సాయం చేస్తూ వుంటాడు. రోడ్డుమీద నిరాధారంగా పడివున్న ఒక రోగిష్టి స్త్రీని తీసుకొచ్చి ఆమె మలమూత్రాలను కూడా అసహ్యం లేకుండా శుభ్రం చేసి ఆమె చనిపోయే క్షణాలలో అమెకు సాంత్వన ఇచ్చిన ప్రేమ మూర్తి.  చనిపోయిన స్త్రీ తాలూకు బిడ్ద కూడా చావుబ్రతుకుల్లోనే  వున్నట్టుంటాడు .వాణ్ణి దగ్గరకు తీస్తుంది మార్గలిత. వాడికి “నాను” అని ముద్దుపేరు పెట్టింది. తన ఉపచారాలతో వాడికి ప్రాణంపోస్తుంది. ఆ పిల్లవాడు ఆమెకు దగ్గరౌతాడు.

ఫాదర్ డేనియల్ బదిలీ కావడంతో కరిక్కన్ ఆస్థానంలో వికార్ గా నియమించబడతాడు. వికార్ అయినప్పుడు వచ్చే అదనపు అధికారాలూ వసతులూ ఆదాయమూ అతని మనసును మార్గలిత మీదనుంచీ మళ్ళిస్తాయని అంతా ఆశిస్తారు.  తన కొడుకు వికార్ అయితే తన హోదా పెరుగుతుంది కనుక, అతని తండ్రి పదివేలు అధిక వడ్డీకి అప్పచేసి ఇల్లు మరమ్మతు చేయిస్తాడు.తల్లీ చెల్లెళ్ళూ ఇల్లు అలికి అలంకరించి అతనికోసం ఎదురుచూస్తుంటారు.కానీ అతను  మార్గలిత ను వెతుక్కుంటూ వెళ్ళి . తనని క్షమించమంటాడు.మార్గలిత కరిగిపోతుంది. ఫాదర్ ఆగస్టీన్ గదిలో మొదటిసారి వాళ్లిద్దరూ దగ్గరౌతారు.

“నేను నా శరరంతోనే భగవంతుణ్ణి ఆశ్రయిస్తాను. నేను అశాశ్వతమైన శరీరాన్నీ శాశ్వతమైన ఆత్మనూ విడదియ్యలేను..ప్రేమలో నా ఆత్మ శరీరాన్నీ,నాశరీరం ఆత్మనూ అధిగమిస్తాయి ఇంత అపరూపమైన  ఆనందాన్ని నేనెప్పుడూ అనుభవించలేదు .ఇది కేవలం ఆత్మకో శరీరానికో ప్రత్యేకమైన ఆనంద పారవశ్యం కాదు.ఇది ఆరెండింటి సమ్మేళనం. నేను మొత్తంగా ఒక ఆనందాంబుధిలో ఈదుతున్నాను. నాలోనించీ ప్రవహించే ఆనందం ఈ భూమికి  శాంతిని ప్రసాదించే నదిలాంటిది .నేనెంతో ప్రశాంతంగా ఆనందంగా వుంటాను,” అనుకుంటుంది మార్గలిత.

అతను మార్గలితను వెంటబెట్టుకుని ఇంటికి తీసుకువస్తాడు.వికార్ గా ఫాదర్ దుస్తుల్లో రావలసిన కొడుకు సాధారణ దుస్తుల్లో ఒక స్త్రీని వెంటపెట్టుకు రావడం చూసి అతను తెచ్చిన కళంకాన్ని తట్టుకోలేక ఆ క్షణమే అతని తండ్రి ఉరి వేసుకుంటాడు. కరిక్కన్ ని అందరూ ఏవగించుకుంటారు. తండ్రి అంత్యక్రియలకు కూడా అతన్ని అనుమతించరు, అట్లా నడివీధిలో నిలబడిన ఆ ఇద్దర్నీ తన ఇంటికి తీసుకుపోతాడు నాస్తికన్ జార్జి. ఒకటిరెండు రోజులు తను ఆదుకోగలడు కానీ తరువాత పనిచేసుకుని సంపాదించుకోమంటాడు. తన ప్రేమతో అతన్ని సాంత్వన పరచడానికి చాలా ప్రయత్నిస్తుంది మార్గలిత.అంత నిరాదరణలోనూ అవమానం లోనూకూడా ఆమె అధైర్య పడదు, ఆమెకు కరిక్కన్ పట్ల ఉన్న ప్రేమ ఇనుమడిస్తుంది.

ఉచిత సహాయాలు అందుకోడం ఇష్టపడని మార్గలిత  రేషన్ షాపు ఊడ్చి రోజూ పదిరూపాయలూ కాసిని బియ్యం సంపాదించి  ఇల్లు నడుపుతుంది . కానీ  తండ్రి మరణంతో ఒక అపరాధభావంతో కృంగిపోతాడు కరిక్కన్ .అతన్ని మార్గలిత ప్రేమకూడా శాంతపర్చలేకపోతుంది. ఆమెతో కలిసివున్నా ఆమెలా అతను ఆమెకు అంకితం కాలేకపోతాడు.. ఈ లోగా ఇద్దరూ ఉద్యోగాలకోసం ఎన్నో సేవాసంస్థలకు అర్జీలు పెడతారు.యొహానన్ కస్సీస్సా కూడా ప్రయత్నిస్తూ వుంటాడు. అప్పుడు కరిక్కన్ ఉలిక్కిపడ్డాడు. మార్గలిత కడుపులో తన శిశువు మొలకెత్తుతోందని తెలిసి. కరిక్కన్ కు దూరంగా వుంటూన్న అతని తల్లి కూడా ఉలిక్కి పడింది.

వాళ్ళు ఆ వూరు విడిచిపోకపోతే తను కూడా ఉరిపెట్టుకుంటానని అతడిని హచ్చరించింది.  కరిక్కన్  చెప్పకుండా అదృశ్యమైపోయాడు. తను పాపం చేశాడు.దానికి ప్రాయశ్చిత్తం చేసుకోడానికి అతను తనను ఎంతో ప్రేమించిన మార్గలితను వదిలివెళ్ళిపోయాడు. ఇప్పుడు లోకం మరో సారి నోరు తెరిచింది. “మార్గలిత దారితప్పిన మనిషి. ఆమె కడుపులో శిశువు కరిక్కన్ ది కాకపోవచ్చు. కరిక్కన్  చాలా మంచివాడు. ఈ ఘోరం భరించలేక వెళ్ళిపోయాడు  కాన్వెంట్ వదలి ఎక్కడెక్కడ తిరిగిందో ఏమో!”  అని వదంతులు పుట్టాయి.

ఉన్నట్టుండి ఒకరోజు ఆగస్టీన్  వచ్చి ” నాను”  ను  ఆమెకు అప్పగించి వెళ్ళిపోతాడు.  మార్గలిత తల్లి ఆమెకు తన భాగం ఆస్తి వ్రాసి ఇస్తుంది. ఆ పత్రాలు తీసుకొచ్చిన  అడ్వొకేట్ చిరమెల్ ఆమె పరిస్థితి తెలిసికూడా, (కరిక్కన్ బిడ్దను మోస్తున్నదని తెలిసికూడా) ఆమెను చర్చి ఆశీస్సులతో  పెళ్ళిచేసుకుంటానని,ప్రతిపాదిస్తాడు.తన భార్య పోయి పదకొండేళ్ళయిందనీ తన కూతురు  వైద్యం చదువుతున్నదని, ఒంటరిగా ఉండలేకపోతున్నాననీ అంటాడు.ఆమె ఒకప్పుడు నన్ కనుక ఆమెలో ఇంకా వినయం. పవిత్రత దైవభీతి ఉంటాయని తనకి నమ్మకం అంటాడు . తనది పరువుకల కుటుంబం అని చెన్నెరి కుటుంబంతో సరితూగే ఆర్థిక స్థితి అనికూడా చెప్పాడు.మార్గలిత చేసిన తప్పులనుకూడా మన్నిస్తానంటాడు.అదంతా వింటూ ఒక రాయివలె నిలబడిన ఆమెతో ఇంక మాట్లాడ్డానికి ఏమీలేక అతను వెళ్ళిపోతాడు. తనొక నిరాడంబరమైన జీవితాన్ని నిగడపాలని నిర్ణయంచుకున్నానని తల్లికి చెప్పి ఆ పత్రాలు ఆమెకు తిరిగి ఇవ్వడానికి ఇంటికి వెళ్ళిన మార్గలితను చిన్నన్న గుమ్మం తొక్కనివ్వడు . ఆ పత్రాలను మెట్లమీద పెట్టి వచ్చేస్తుంది.కడుపులో బిడ్డతోనూ పెంపడుబిడ్డతోనూ జీవితాన్ని ఒంటరిగా ఎదుర్కోవడానికి  సంసిద్ధంగా…అది కథ.

“ నేను కాన్వెంట్ లంటే  సర్వ స్వతంత్రమైన స్త్రీ సంస్థలనుకునేవాడిని.వాటికి పూర్తి ఆర్థిక స్వాతంత్ర్యం వుంటుంది.వాటిమీద చర్చి  కి ఎలాంటి అధికారం వుండదు. వాళ్ళ నిర్మాణాన్ని వాళ్ల ధ్యేయాలనూ సన్యాసినులే(నన్స్) ఎంచుకుంటారు వాళ్ల సంస్థల్లో వాళ్ళు సర్వస్వతంత్రులు. ఇళ్ళల్లో వుండే స్త్రీలకు ఇష్టమున్నా లేకపోయినా కొన్ని పనులు తప్పవు. కానీ వీళ్ళకి అటువంటి బానిసత్వంలేదు. పురుషుల ఆధిపత్యమూ ,సహాయమూ లేకుండా సంస్థల్ని నడపడం,నిజంగా ఒక  విప్లవంలాంటది అనుకునేవాడిని.కానీ  అక్కడ ఉండే నిర్బంధాలను గురించీ హింస గురించీ  వేధింపుల గురించీ మాకు తెలియదు.కాన్వెంట్ లో చేరిన పదహారు పదిహేడేళ్ళ అమ్మాయిల మానసిక అవస్థలను గురించి తెలియదు,” అని పాల్ జకారియా అనుకున్నట్లు మనం కూడా అనుకుంటాం.

కానీ కొన్ని కాన్వెంట్స్ లో చర్చిల్లో ,కొందరు ఫాదర్లు మదర్ సుపీయర్లు ఎట్లా ప్రవర్తిస్తారో ,మతం అనేది మనుషులకు  దారిచూపే దీపంలా కాకుండా ఒక వ్యాపార సంస్థలా ఎట్లా తయారౌతోందో,ఒకప్పుడు సమాజంలో పాదుకోడానికి ప్రయత్నించిన హేతువాద భావాలూ, నాస్తికత్వమూ  వెనక్కి తగ్గి మళ్ళీ మహిమలకూ, మంత్రాలకూ, క్రతువులకూ ఎట్లా జనం బానిసలౌతున్నారో , చర్చిలో ,కుటుంబంలో సమాజంలో మతంలో నిచ్చెన మెట్ల వ్యవస్థ ఎట్లా కాపాడ బడుతుందో..వంటి ఎన్నో విషయాలను ఈ నవలలో చర్చకు పెడుతుంది సారాజోసెఫ్.

ఇంత ధైర్యంగా చర్చిని విమర్శిస్తూ వ్రాసిన నవల మళయాళంలో ఇటీవల ఇదేనేమో ! చర్చి  లో వుండే ఫాదర్లకు బ్రదర్లకు నిర్బంధ బ్రహ్మచర్యం విధించకూడదంటాడు యొహానన్ కస్సీస్సా. ఈ విషయంలో క్యాథలిక్ చర్చి పునరాలోచన చెయ్యాలంటాడు .సిరియన్ క్రిష్టియన్స్ లో ఈ నిబంధన లేదు. అందుకు కస్సీస్సా ఇల్లే ఉదాహరణ. కస్సీస్సా చాలా హేతుబద్ధంగా ఆచరణత్మకంగా ఆలోచిస్తాడు.

“చర్చి ఒక వ్యవస్థగా మారడం అందులోకి భౌతిక సౌఖ్యాలు ప్రవేశించడం సమాజంలో మారుతున్న విలువలు చర్చిలోకి కూడా ప్రవేశించడం క్రిష్టియానిటీ లో వుండవలసిన ఆధ్యాత్మికతను నిరాడంబరతనూ వెనక్కి నెడుతున్నాయి” అంటుంది ఈ నవలకు పరిచయవ్యాసం వ్రాసిన జాన్సీ జేమ్స్ .

ఎక్కడికక్కడ మళయాళీ సుగంధాన్ని కాపాడుతూ అనువదించిన వాల్సన్ థంఫు  “ఏవిశ్వాసంలో నైనా అసలు సత్యం  ఏమిటో తెలుసుకోడానికి  వ్యక్తి చేసే  అన్వేషణ కు ఈ నవల ఒక ఉదాహరణ.సారా జోసెఫ్ సంధించిన ప్రశ్నలకు జవాబిచ్చేందుకు వ్యవస్థీకృతమైన  కైస్తవ మతం సిద్ధంగా లేదు.మనకి కావలసినది బైబిల్ లో చెప్పిన క్రైస్తవం కానీ చర్చి క్రైస్తవం కాదు” అంటాడు. మతం ఒక శిల కాదు.అదొక ప్రవాహం అంటుంది సారా జోసెఫ్.అది ఒక్క క్రైస్తవానికే కాదు అన్ని మతాలకూ అన్ని విశ్వాసాలకూ వర్తిస్తుంది.

సారా జోసెఫ్ వ్రాసిన “అలహాయుదె పెన్మక్కల్” ( అలహా బిడ్దలు –అంటే దేవుని బిడ్డలు) నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది.  “అలహాయుదె పెన్మక్కల్,” “మాటతి,” “ఒథప్పు” మూడు నవలలు కలసి ఒక ట్రయాలజీ లా వుంటాయి. సారా జోసెఫ్ మళయాళం ప్రొఫెసర్ గా పనిచేసి రిటైరయ్యారు.అనేక సామాజిక ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారు రామాయణంలో శూర్పణఖ మంధర ,సీత పాత్రలను ఒక  కొత్త దృష్టికోణంతో విశ్లేషించారు. అనేక కథలు వ్రాసారు .కేరళలో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు  “నేను స్త్రీగా పుట్టినందుకు గర్విస్తాను. స్త్రీల పై వివక్ష ,వారినికేవలం శరీరాలుగా మాత్రమే చూడడం ,వారికిచ్చే పరిమితమైన ప్రాధాన్యత ల గురించి  వ్రాయడం నా ముఖ్య కర్తవ్యం. అది నిర్వహించగలుగుతున్నందుకు కూడా నేను గర్విస్తాను,” అంటుంది  ,కేరళలో స్త్రీవాదోద్యమానికి నాందిపలికిన ఈ రచయిత్రి.

“ది సెంట్ ఆఫ్ ది అదర్ సైడ్ ” గా ఈ నవలను అనువదించిన వాల్సన్ థంపు , డిల్లీ లోని సెంట్ స్టీఫెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ .ధర్మశాస్త్రవేత్త ,శాంతి ఉద్యమ కారుడు.రచయిత. మతం గురించీ, అనేక సామాజిక సాంస్కృతిక అంశాల గురించీ విస్తృతంగా వ్రాసారు. సారా జోసెఫ్ కథలు అనేకం ఆంగ్లంలో అనువదించారు. ఈ నవల ఆక్స్ ఫర్డ్  యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది.

మీ మాటలు

  1. ఒక ముఖ్యమైన పుస్తకానికి, అతి ముఖ్యమైన పరిచయం ఇది. ఇప్పుడు నవలని వెతికి పట్టుకోవాలి, చదవడానికి.

  2. రమాసుందరి says:

    ప్రకృతికి అసహజమైన విషయాలను నిర్భంధపు మతవిధానాలుగా అవలంబచేయ చూస్తున్నారు. మంచి పుస్తకాలను పరిచయం చేస్తున్నారు సత్యవతి గారు.

  3. ns murty says:

    సత్యవతి గారూ,
    ఎంత అద్భుతమైన పుస్తకాన్ని పరిచయం చేశారండి!
    అభినందనలూ, కృతజ్ఞతలూ.

  4. RammohanRao thummuri says:

    మతం ఏదైనా ఇలాంటి సందర్భాలు కొన్ని ఉంటాయి.వాటిని తట్టుకొని ధైర్యం గా నిలబడగలిగే స్ఫూర్తి నికలిగించే నవలను ,నవల చదివితే కలిగే అనుభూతిని అందిస్తూ పరిచయం చేసారు విజయ లక్ష్మి గారు.మానసిక పరిణతి పెంచే నవల.ఇలాంటి
    ఇతి వృత్తం తో ఇంకా నవలలు రావాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది

    • RammohanRao thummuri says:

      పొరపాటున విజయలక్ష్మి అని పడింది క్షమించండి సత్యవతి గారు.

  5. పరిచయం బాగుంది. విజయన్ గారి స్మారక అవార్డు అందుకోవడం కోసం హైదరాబాద్ వచ్చిన సారా జోసెఫ్ ను nenu ఇంటర్వ్యూ చేసాను. అది ఈ లింక్ లో ఉంది.

    http://webcache.googleusercontent.com/search?q=cache:HjFm02rMbjMJ:www.andhrajyothy.com/navyaNewsShow.asp%3Fqry%3D2011/nov/7/navya/7navya1%26more%3D2011/nov/7/navya/navyamain%26date%3D10/7/2011+&cd=3&hl=en&ct=clnk&gl=in#.UV6alEpSRkg

  6. Sivalakshmi says:

    పరిచయం స్పష్టంగా నవలని అర్ధం చేయిస్తుంది.వెంటనే చదివెయ్యాలని ఆరాటపడేలా చేస్తుంది.నాకైతే నా అభిమాన నవల “The Scarlet Letter”లోని కథానాయిక Hester Prynne పడిన కష్టాలు గుర్తుకొచ్చాయి.కథా నాయకుడి(Dimmesdale) పిరికితనం లాంటి కొన్ని పోలికలున్నాయి . మతాలన్నీ స్త్రీలను అణచిపెట్టివుంచడానికే పుట్టాయి.మంచి ఆలోచనల్ని రేకెత్తించే నవలను పరిచయం చేసిన సత్యవతిగారికి అభినందనలు.

Leave a Reply to రమాసుందరి Cancel reply

*