నెత్తుటి నేలపై ప్రేమ పతాక!

Sriram-Photograph“జూలిన్ షేనబెల్ గొప్పతనం ఏమిటంటే ప్రపంచ నాయకులను చర్చలకు ప్రేరేపించేటంతటి గొప్ప కళను సృజించడం’’ — జేవియర్ బార్డెం

మీరు ఒక క్రూరమైన, ప్రబలమైన శక్తి చేత అణచివేయబడుతున్నప్పుడు, ఆ శత్రుత్వంతో నిండిన పరిస్థితులను ఎలా అర్థం చేసుకుంటారు?

ద్వేషానికి  లొంగిపోవడం ద్వారా మీలోని విచక్షణని విడిచిపెడతారా, లేక వాస్తవ  పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా వైరి భావాన్ని  అధిగమించడానికి ప్రయత్నిస్తారా?

గొప్ప ఆలోచనాపరులు అరుదు. దర్శకుడు  జూలిన్ షేనబెల్ గాంధీవలె గొప్ప దార్శనికుడు, ఆలోచనాపరుడు.

ఎన్నో చలన  చిత్రాలు క్రూరమైన యుద్ధాల గురించి లోతైన జ్ఞానాన్ని అందిస్తాయి. కాని  అరుదుగా “మిరల్” వంటి కొన్ని చిత్రాలు మాత్రమే మనసులోని ద్వేషం యొక్క  మూలాల్ని శోధించడానికి, అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాయి. ఆ విధంగా  ఆచరణాత్మకమైన పరిష్కారాల్ని, శాంతితో కూడిన ప్రపంచాన్ని సృష్టించుకోవడం  సాధ్యమేనన్న ఒక ఆశని మన నిస్పృహకు లొంగిపోయిన హృదయాలకు కలిగిస్తాయి. ఈ  సంక్షుభిత లోకానికి మిరల్ వంటి చిత్రాల అవసరం ఎంతో ఉంది. మానవ హృదయంలోని  బలీయమైన ప్రతీకారేచ్ఛ యొక్క తీవ్రతను చూసి తల్లడిల్లిన హృదయాలకు ఈ చిత్రం  ఓదార్పుని ఇస్తుంది.

“మిరల్” దశాబ్దాలుగా రగులుతున్న ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్యపై లోతైన అవగాహనని ఇవ్వడమే కాదు, పరిష్కారాన్ని చూపించడానికి కూడా   ప్రయత్నిస్తుంది. అయితే ఈ చిత్రం ఇజ్రాయిల్ కోణం నుండి లేదా పాలస్తీనా  కోణం నుండి కాకుండా ప్రజల కోణం నుండి మాట్లాడుతుంది. ప్రజల దైన్యానికి  ఇజ్రాయిల్ ఎంత కారణమో హమాస్ కూడా అంతే కారణం అని చెబుతుంది. హింస,  తీవ్రవాదం మానవ జీవితాన్ని ఎంతటి దయనీయ స్థితికి నెడతాయో వివరిస్తుంది.  వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం ఎంతోమంది దయాన్విత హృదయుల  జీవితాలకు అద్దంపడుతుంది.

1948, అరబ్-ఇజ్రాయిల్ యుద్ధం సమయంలో,  దెయిర్ యాసిన్ నరమేథం తరువాత,  భీతిగొలిపే పరిస్థితుల్లో  వీధుల్లో తల్లితండ్రులు మరణించి అనాధలై భయంతో  వణికిపోతున్న 55 మంది చిన్నారుల్ని మహోన్నతురాలు హింద్  హుస్సేన్ జరేసులేం  తన ఇంటికి తీసుకువెళ్ళి వాళ్లకి ఆహారం,  ఆశ్రయం కల్పించే దయనీయమైన సన్నివేశంతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ఆరు  నెలల్లో ఆ 55 మంది కాస్తా 2,000 అవుతారు. వారికి ఆమె ఆహారాన్ని ఎలా  సమకూరుస్తుంది  ?  అమానవీయ పరిస్థితుల నుండి రక్షణ ఎలా కల్పించగలదు ? ఆమె తన  వ్యక్తి గత జీవితాన్ని, ఆనందాన్ని వారి కోసం వదులుకొని, ప్రమాదకరమైన రాజకీయ  అనిశ్చిత పరిస్థితులకు దూరంగా వారిని సంరక్షించేందుకు దర్-అల్-టిఫెల్  ఇనిస్టిట్యూట్ ని ప్రారంభిస్తుంది.

1778లో మిరల్ అనే 5 ఏళ్ల బాలికను  ఆమె తండ్రి తన భార్య మరణించించిన కారణంగా హింద్ హుస్సేన్ కు అప్పగిస్తాడు.  సంక్షుభిత బాహ్య పరిస్థితుల ఛాయలు తెలియకుండా దర్-అల్-టిఫెల్  ఇనిస్టిట్యూట్లో మిరల్ పెరుగుతుంది. ఆమె తన 17 ఏళ్ల వయసులో ఒక శరణార్థ  శిభిరంలోని పిల్లలకి బోధించడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి పాలస్తీనా  శరణార్థుల దయనీయ పరిస్థితులను, బాహ్య ప్రపంచపు క్రూరత్వాన్నిచూస్తుంది.  తీవ్రవాది అయిన హని ప్రేమలో పడి “ఫస్ట్ ఇన్ఫిదా” విప్లవోద్యమం వైపు  ఆకర్షితమవుతుంది. విప్లవోద్యమానికి, విద్యయే శాంతికి మార్గమని నమ్మే హింద్  హుస్సేన్ ఆశయాలకి నడుమ  మిరల్  నలిగిపోతుంది.

miral-3

ప్రియుడు హనిని విప్లవకారులే  ద్రోహిగా ముద్రవేసి అనుమానించి చంపివేయడంతో హతాశురాలైన మిరల్ హింసతో నిండిన  తీవ్రవాదం సమస్యలకు పరిష్కారం చూపకపోగా ప్రజల జీవితాల్ని మరింత దుర్భర  పరిస్థితుల్లోకి నెట్టివేస్తుందని అర్థం చేసుకుంటుంది. న్యూయార్క్ లోని  ప్రజలవలె ఇజ్రాయీయులు, పాలస్తీనీయులు, అలాగే అన్ని జాతుల ప్రజలు కలిసి ఒకే  దేశంగా ఎందుకు ఉండకూడదు అని ఆలోచిస్తుంది. దశాబ్దాలుగా పాలస్తీనా భూభాగంలో  సెటిలర్స్ గా జీవిస్తున్న ఇజ్రాయిల్ ప్రజల పై హమాస్ తీవ్రవాదుల హింస కూడా  వ్యతిరేకిస్తుంది.

రాజకీయ కారణాలకు, సామాన్య జీవితాలకు ఎంతో  వ్యత్యాసం ఉంటుంది. ఎన్నటికీ గెలవలేని యుద్ధంలో తరాల ప్రజల ఆనందాన్ని ఫణంగా  పెట్టే కంటే తక్కువ శాతం భూభాగాన్ని స్వీకరించి సర్దుకోవడానికి, ఇజ్రాయిల్  తో చర్చలకు ప్రయత్నిస్తున్న మితవాదులైనవారి వైపు మొగ్గు చూపుతుంది మిరల్. ఈ  చిత్రం సామాన్య ప్రజలలో మన చుట్టూ జీవించి ఉన్న మహాత్ములను పరిచయం  చేస్తుంది.  ఉద్యమాలు ఎలా  మేధావులు, ఆలోచనపరులైన వారి చేతుల్లో నుండి  ఆవేశపరులు  , రహస్య రాజకీయ ఆశయాలు గల వారి చేతుల్లోకి వెళ్లిపోతున్నాయో,  ప్రజలు ఎలా రాజకీయ సిద్ధాంతాలకు ఉద్రేకులై హింసలో పడి తమ జీవితాల్ని నాశనం  చేసుకుంటారో సజీవంగా చూపుతుంది.

హింసతో కాకుండా సామరస్యంతో పరిష్కారం  సాధ్యం అని నమ్మే కొంతమంది ఆశకు బలాన్నిస్తుంది ఈ చిత్రం. హింసతో కూడిన  తీవ్రవాదం యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో రవీంద్రనాథ్ టాగోర్ తన “చార్  అధ్యాయ్” నవలలో వివరించడం అప్పటి అతివాద భారత స్వాతంత్ర్య ఉద్యమకారుల్ని  నిరాశ పరచింది. బ్రిటిష్ ప్రభుత్వం విప్లవోద్యమాల్ని నైతికంగా  దెబ్బతీయడానికి “చార్ అధ్యాయ్” నవలని ఉపయోగించుకొందని వారు ఆరోపించారు.  కాని మానవత్వంపై అచంచలమైన విశ్వాసం ఉన్న టాగోర్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో  గాని, మరే ఇతర ప్రపంచ విప్లవోద్యమాలలోగాని హింసను, తీవ్రవాదాన్నిగాని  సహించలేదు.

“మిరల్” చిత్రం ఒక ప్రాంతంతోగాని, ఒక దేశంతో గాని లేదా ఒక  జాతితో గాని తమని తాము identify చేసుకునేవారికి నచ్చకపోవచ్చు. కాని  మనిషిని మనిషిగా ప్రేమించేవారి హృదయాలపై బలమైన ముద్రని వేస్తుంది.

మిరల్ (2010)

నిడివి:  112 నిముషాలు భాష: ఆంగ్లం దర్శకత్వం : జూలిన్ షేనబెల్ నటులు: ఫ్రిదా  పింటో, విలియమ్ డిఫోయ్, హియం అబ్బాస్, అలెగ్జాండర్ సిద్దిక్

మీ మాటలు

  1. BHUVANACHANDRA says:

    చాలా చాలా బాగుంది. ఇలాగే కొనసాగించండి …శుభమస్తు

    • శ్రీరామ్ says:

      ధన్యవాదాలు, భువనచంద్ర గారు…మీకు నా వ్యాసం నచ్చడం ఎంతో సంతోషాన్ని కలిగించింది.

మీ మాటలు

*